సీఎం గారు.. పగలు విశాఖకు రాకండి

ABN , First Publish Date - 2022-02-11T09:02:46+05:30 IST

విశాఖపట్నం పర్యటనకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పగటి పూట మాత్రం రావద్దని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు.

సీఎం గారు..   పగలు విశాఖకు రాకండి

మీ పర్యటనతో ప్రజలు నరకం చూశారు: విష్ణుకుమార్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పర్యటనకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పగటి పూట మాత్రం రావద్దని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఎప్పుడైనా విశాఖకు వస్తే రాత్రి 9 గంటల తర్వాత వచ్చి, ఉదయం 7 గంటలలోపు తిరిగి వెళ్లిపోవాలని కోరారు. గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం విశాఖలో జగన్‌ పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో ఎంతోమంది సీఎంలు వచ్చినా ప్రజలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనలేదన్నారు. దుకాణాలు మూసేసి, విమాన ప్రయాణికులను నిలిపివేసి సుమారు మూడు గంటల పాటు నరకం చూపించారని విమర్శించారు. విశాఖలో టీటీడీ నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రారంభించలేదని, ఆరు నెలల నుంచి వాయిదా వేస్తున్నారన్నారు. 


అనేకసార్లు విజ్ఞప్తి చేస్తే, ఉత్తరాయణం రావాలన్నారని, అది వచ్చి కూడా నెలైందన్నారు. పది రోజుల్లోగా ఆలయ ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించకపోతే, తామే నిర్ణయించి ప్రకటిస్తామన్నారు. సీఎం రాకపోతే స్వామీజీలతోనే ప్రారంభిస్తామని హెచ్చరించారు. రాజధానిగా అమరావతి వద్దంటున్నారని, అప్పు కోసం తాకట్టుకు ఆ భూములు కావాలా? అని ప్రశ్నించారు. ఏటా ఆగస్టులో భూముల విలువలు పెంచుతారని, ఈసారి ఏప్రిల్‌ నుంచే పెంచడానికి నిర్ణయించారన్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడంతో పాటు పెరిగిన ఆస్తి విలువలపై మునిసిపాలిటీలు మరింత పన్ను వేస్తాయని విమర్శించారు. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం గద్దె దిగిపోయే సమయం వచ్చిందన్నారు. 

Updated Date - 2022-02-11T09:02:46+05:30 IST