YS Viveka హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. అంతా ప్లాన్ ప్రకారమే.. తేల్చేసిన CBI..!

ABN , First Publish Date - 2022-02-15T07:51:02+05:30 IST

2019 మార్చి 15వ తేదీన పులివెందులలో జరిగిన వివేకా హత్యపై గత ఏడాది అక్టోబరు 10న తొలి చార్జిషీటు...

YS Viveka హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. అంతా ప్లాన్ ప్రకారమే.. తేల్చేసిన CBI..!

  • ‘గుండెపోటు’ కథ అవినాశ్‌ రెడ్డిదే!
  • వివేకా హత్య కేసులో ఆయనా అనుమానితుడే
  • ఆయనకు ఎంపీ టికెట్‌ ఇవ్వొద్దన్న వివేకా
  • అందుకే హత్య చేయించారనే అనుమానం
  • వివేకా రక్తపు మడుగులో ఉండగానే ఎంపీ రాక
  • రక్తపు మరకలు శుభ్రం చేయించారు
  • శంకర్‌ రెడ్డితో కలిసి ‘గుండెపోటు’ థియరీ
  • అదే కథ చెప్పాలని సీఐకి శంకర్‌రెడ్డి బెదిరింపులు
  • ఆయన నుంచే జగన్‌ చానల్‌కు తొలి సమాచారం
  • హత్య చేసినట్లు ఒప్పుకోవాలని గంగాధర్‌ రెడ్డికి 10 కోట్లు ఆఫర్‌
  • సీబీఐ చార్జిషీట్లలో సంచలన సంగతులు


కడప, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానంద రెడ్డి ‘గుండెపోటుతో మరణించారు’ అని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డే తొలుత ప్రచారం చేశారని సీబీఐ తేల్చి చెప్పింది. 2019 మార్చి 15వ తేదీన  పులివెందులలో జరిగిన వివేకా హత్యపై గత ఏడాది అక్టోబరు 10న తొలి చార్జిషీటు, గతనెల 31వ తేదీన మరో నివేదికను కోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం... వివేకా గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక అవినాశ్‌ రెడ్డి పాత్ర ఉందని స్పష్టం చేసింది.


‘‘అప్పటికి బాత్‌రూమ్‌లో... రక్తపు మడుగులో వివేకానంద రెడ్డి మృతదేహం పడి ఉంది. డి.శంకర్‌ రెడ్డితో కలిసి ఎంపీ అవినాశ్‌ రెడ్డి అక్కడికి వచ్చారు. ఆయన గుండెపోటుతో మరణించారనే థియరీ అప్పటికప్పుడే మొదలుపెట్టారు. ఈలోపు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి (అవినాశ్‌ రెడ్డి తండ్రి), వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయడంపై అందరూ చర్చించుకున్నారు. గంగిరెడ్డి, శంకర్‌ రెడ్డి మరికొందరితో కలిసి పనివాళ్లతో బెడ్‌రూమ్‌లో, బాత్‌రూమ్‌లో రక్తపు మరకలను శుభ్రం చేయించారు. వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా చక్కగా కట్లు కట్టించి... అంబులెన్స్‌లో పులివెందుల ఆస్పత్రికి తరలించారు’’ అని సీబీఐ తెలిపింది. ఈ హత్య కేసులో అవినాశ్‌ రెడ్డిని అనుమానితుడిగా పేర్కొంది. ‘‘కడప ఎంపీ టికెట్‌ తనకు లేదా వైఎస్‌ షర్మిలకు, అదీకాకపోతే వైఎస్‌ విజయమ్మకు దక్కాలని వివేకానందరెడ్డి గట్టిగా చెప్పేవారు. వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వకూడదని భావించేవారు. ఈ నేపథ్యంలో... తనకు సన్నిహిత అనుచరుడైన డి.శంకర్‌రెడ్డితో అవినాశ్‌ రెడ్డే ఈ హత్య చేయించారనే అనుమానం ఉంది. అయితే... ఈ కోణంలో ఇంకా దర్యాప్తు సాగుతోంది’’ అని సీబీఐ పేర్కొంది.


అంతా పథకం ప్రకారమే...

పక్కా ప్రణాళిక ప్రకారమే వివేకా హత్య జరిగినట్లు సీబీఐ స్పష్టం చేసింది. ఆయనకు బాగా సన్నిహితులు, పరిచయస్తులైన ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి ఈ కుట్ర పన్నినట్లు తెలిపింది. 2019 మార్చి 10 గంగిరెడ్డి నివాసంలోనే వివేకా హత్యకు ప్రణాళిక రచించినట్లు వెల్లడించింది. ఇందుకు రూ.40 కోట్లకు డీల్‌ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. రాజకీయంగా తమ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నారనే అడ్డు తొలగించుకున్నారని తెలిపింది. ఈ హత్యకు బెంగళూరు ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ సహా 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కారణమని, తమ రాజకీయ ఎదుగుదలకు వివేకా అడ్డుగా ఉంటాడని ఆయన్ను అడ్డు తొలగించుకునే కుట్రలో భాగంగానే హత్య జరిగిందని సీబీఐ అందులో స్పష్టంగా తెలియజేసింది.


ఏ-5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అలియాస్‌ డి.శంకర్‌రెడ్డి.. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. హత్య జరిగిన తర్వాత వివేకా ఇంటికి చేరుకున్న శంకర్‌రెడ్డి, ఏ-1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి రక్తపు మరకలు శుభ్రం చేయించి హత్య ఆధారాలు చెరిపేయడంలో కీలక పాత్ర పోషించారని సీబీఐ వెల్లడించింది. ‘అంతేకాదు.. గుండెపోటు వల్ల మృతి చెందాడని నమ్మించే ప్రయత్నంలో భాగంగా సాక్షి టీవీకి శంకర్‌రెడ్డే సమాచారం ఇచ్చాడు. హత్య చేసినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు ఇస్తానని గంగాధర్‌రెడ్డి అనే వ్యక్తికి శంకర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చాడు..’ అని తెలిపింది.


చార్జిషీటులో ముఖ్యాంశాలివీ..

ఫ ఏ-4 దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. వివేకా హత్యలో దాగి ఉన్న కుట్ర, సాక్ష్యాలను తారుమారు చేయడంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. ఏ-5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై విచారణ జరుపగా.. వివేకా హత్య సాక్ష్యాఽధారాలను అతడు నాశనం చేసినట్లు గుర్తించి గత ఏడాది నవంబరు 17న అరెస్టు చేశాం.


శివశంకర్‌రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. వివేకానందారెడ్డి వైసీపీలో చేరడంతో ఆయనకు, ఆయన సన్నిహిత సీనియర్‌ నాయకులకు అసంతృప్తిగా ఉంది. కారణం.. వివేకా కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమలోనే రాజకీయంగా పట్టు కలిగిన వ్యక్తి. ఆయన వైసీపీలో ఉంటే తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉంటారని భావించారు. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ను శివశంకర్‌రెడ్డి కూడా ఆశించాడు. ఆయన్ను కాదని వివేకాకు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో శివశంకర్‌రెడ్డి సహకరించలేదు. తాను ఓడిపోవడంతో వివేకా ఆ తర్వాత ఎర్రగంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సీఐని బెదిరించాడు..

వివేకా శరీరంపై ఏడు గాయాలున్నాయి. మెదడుకు బలమైన గాయంతోనే మృతిచెందారు. 2019 మార్చి 15న ఉదయం 6.30 గంటలకు శివశంకర్‌ రెడ్డి వెళ్లి.. కుట్రలో భాగంగానే వివేకా గుండెపోటుతో మరణించాడని తప్పుడు ప్రచారం చేశాడు. అదే విషయాన్ని జగన్‌ చానల్‌కు కూడా చెప్పాడు. వివేకా మద్దతుదారులను కంట్రోల్‌ చేయాలని సీఐ శంకరయ్యకు చెప్పాడు. అలాగే.. వివేకా రక్తపు వాంతులు, గుండెపోటుతో మరణించినట్లు మెసేజ్‌ చేయాలని సీఐని బెదిరించాడు.


గడియ పెట్టుకుని.. కట్టుకట్టారు

వివేకా ఇంటి పనిమనిషి రాగిరి లక్ష్మి ద్వారా రక్తపు మరకలు తొలగించడంలో శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డిలు కీలకంగా వ్యవహరించారు. దూది, బ్యాండేజీ, బాడీ ఫ్రీజర్‌ ఏర్పాటు చేయడంలోనూ వీరిద్దరే ప్రముఖ పాత్ర పోషించారు. ఆ తర్వాత కాంపౌండర్‌ గజ్జల జయప్రకాశ్‌రెడ్డి సహకారంతో శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి రూంకు గడిపెట్టుకొని కట్టు కట్టడమే కాకుండా.. బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు శుభ్రం చేసి సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో పాలుపంచుకున్నారని పనిమనిషి లక్ష్మి, ప్రకాశ్‌, ఇతర సాక్షులు టి.మధుసూనరెడ్డి, ఆర్‌. వెంకటరమణ వివరించారు. వారిద్దరూ బలవంతం చేయడంతోనే పనిమనిషి రక్తం శుభ్రం చేసినట్లు సాక్షి వైఎస్‌ ప్రతా్‌పరెడ్డి కూడా చెప్పారు. ఇదే విషయాన్ని సీఐ శంకరయ్యకు కూడా ఫిర్యాదు చేశానని ప్రతా్‌పరెడ్డి వెల్లడించారు.


కుమార్తెకు సమాచారమివ్వలేదు..

వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు తనకు శివశంకర్‌రెడ్డే సమాచారం ఇచ్చాడని సాక్షి టీవీ రిపోర్టరు బాలకృష్ణారెడ్డి తెలిపాడు. టీవీ వీడియో ఫుటేజీని ఆ టీవీ నుంచి స్వాధీనం చేసుకున్నాం. శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి.. వివేకా ఇంటికి చేరుకుని హత్యకు సంబంధించిన ఆధారాలు తొలగించాలని చూశారే తప్ప.. వివేకా కుమార్తెకు సమాచారం ఇవ్వలేదు. ఆమె లేకుండానే మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారు. తప్పుడు సమాచారం, అసంపూర్తి సమాచారంతో ఎంవీ కృష్ణారెడ్డి ద్వారా ఫిర్యాదు చేయించి దానినే ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయాలని సీఐ శంకరయ్యను శివశంకర్‌రెడ్డి బలవంతం చేశారు.


దస్తగిరికి శంకర్‌రెడ్డి ప్రలోభాలు..

వివేకా హత్య తానే చేసినట్లు అంగీకరిస్తే.. రూ.10 కోట్లు ఇస్తానని కె.గంగాధర్‌రెడ్డికి శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ చేశారు. అలాగే దస్తగిరి 164 నిబంధన కింద వాంగ్మూలం ఇచ్చాక కూడా ప్రలోభాలకు గురి చేశారు. 2021 మార్చి 3న ఢిల్లీకి రమ్మని దస్తగిరికి నోటీసిచ్చాక.. 20 రోజుల ముందే శివశంకర్‌రెడ్డి దస్తగిరిని పిలిచి తమ పేర్లు సీబీఐకి చెప్పవద్దని బయ్యపురెడ్డి ఇంట్లో బెదిరించారు. తన ఇంటికి శివశంకర్‌రెడ్డి వచ్చినట్లు బయ్యపురెడ్డి కూడా చెప్పాడు. దస్తగిరిని కనిపెట్టుకుని ఉండడానికి భరత్‌ యాదవ్‌ను శివశంకర్‌రెడ్డే అతడి వెంట పంపాడు. హత్య జరిగిన తర్వాత.. తమ పేర్లు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాచ్‌మన్‌ రంగన్నను గంగిరెడ్డి బెదిరించడంతో భయపడిపోయి.. ఆయన పోలీసులకు నిజం చెప్పలేదు.


ఎవరికి.. ఎందుకు కోపం?

2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఎర్ర గంగిరెడ్డి, గజ్జల జగదీశ్వర్‌ రెడ్డి (ఉమాశంకర్‌ రెడ్డి సోదరుడు) కీలక పాత్ర పోషించారు. ఓటమిలో గంగిరెడ్డి పాత్ర ఉందనే అనుమానంతో ఆయనపై వివేకా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెంగళూరులో జరిగిన ఒక వివాదాస్పద భూమి ‘సెటిల్‌మెంట్‌’లో తనకు వాటా రావాలని ఎర్ర గంగిరెడ్డి ఆశించగా... అది ఇచ్చేందుకు వివేకా నిరాకరించారు. 

హత్యకు ఏడాదిన్నర ముందు నుంచి వివేకాకు యాదాటి సునీల్‌ యాదవ్‌ తెలుసు. తన వద్ద కొన్ని వజ్రాలు ఉన్నాయని... వాటిని అమ్మితే బాగా డబ్బులు వస్తాయని వివేకానందకు తప్పుడు కథలు చెప్పారు.

స్థానిక రాజకీయాల్లో ఎదిగే అవకాశం ఇవ్వడంలేదంటూ  వివేకాపై ఉమా శంకర్‌ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారు.

డ్రైవర్‌ పని నుంచి తీసేయడంతో మరికొన్ని కారణాలతో దస్తగిరి కూడా వివేకాపై కోపం పెంచుకున్నారు. 


నెల ముందే ప్రణాళిక..

వివేకా హత్యకు నెల రోజుల ముందే ప్రణాళిక రూపొందించినట్లు ఏ-4 షేక్‌ దస్తగిరి విచారణలో వెల్లడించాడు. శివశంకర్‌రెడ్డి, మరికొందరు పెద్దలు కలసి వివేకాను హత్య చేయడానికి రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందని గంగిరెడ్డి చెప్పినట్లు తెలిపాడు. 2019 మార్చి 15న సునీల్‌ యాదవ్‌.. దస్తగిరిని, మరో ఇద్దరు నిందితులను పిలిచి ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పాడు. శివశంకర్‌రెడ్డి, అతడు సన్నిహితంగా ఉండే సీనియర్‌ నాయకులు అన్నిటినీ చూసుకుంటారు.. డబ్బు తర్వాత మీకు అందుతుందని గంగిరెడ్డి హామీ ఇచ్చాడు. అదే రోజు పోలీసులు దస్తగిరి, ఇతర నిందితులను పిలిపించారు. ఆదోళన చెందవద్దని, హత్యకు సంబంధించిన ఆధారాలు చెరిపేసి నాశనం చేశామని గంగిరెడ్డి వారికి చెప్పాడు.

Updated Date - 2022-02-15T07:51:02+05:30 IST