అసెంబ్లింగ్లోనే తేడా!?
ABN , First Publish Date - 2020-08-02T08:05:04+05:30 IST
భారీ నౌకలను నిర్మించే సామర్థ్యం! సిబ్బందిలో ఉత్తమ నైపుణ్యం!
- ట్రయల్ రన్ చేయకుండా
- ముఖం చాటేసిన ముంబై కంపెనీ
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి) : భారీ నౌకలను నిర్మించే సామర్థ్యం! సిబ్బందిలో ఉత్తమ నైపుణ్యం! భారత నౌకాదళానికి ఎంతో కీలకం! ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎ్సఎల్)లోనే క్రేన్ కూలిపోయి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి కారణాలపై ఆరా తీయగా... క్రేన్ను అమర్చిన ముంబై సంస్థదే ఈ పాపమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రేన్ విడి భాగాలను తీసుకొచ్చిన అనుపమ్ కంపెనీ రెండేళ్ల క్రితమే హెచ్ఎ్సఎల్లో అసెంబుల్ చేసింది. ట్రయల్ రన్ చేసి క్రేన్ సురక్షితమని, ఉపయోగించడానికి సిద్ధంగా ఉందని ఈ సంస్థే సర్టిఫై చేయాలి. కానీ... ఆ పని చేయలేదు. క్రేన్కు సంబంధించిన విడి భాగాలు తీసుకువచ్చారని, అవి ఒక దానికొకటి సరిపోలేదని అనుమానిస్తున్నారు. అందువల్లే, ఆ కంపెనీ ముఖం చాటేసిందని చెబుతున్నారు. దీంతో ఈ పనిని అధికారులు స్థానికంగా ఉన్న మూడు కంపెనీలకు అప్పగించారు. ఇందులో భాగంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నప్పుడే ప్రమాదం జరిగింది. అసెంబ్లింగ్లో లోపమే దీనికి కారణమా అనే అంశంపై అధికారులు దృష్టిసారించారు. భారీ క్రేన్ ఆపరేషన్లో ఉండగా జరిగితే, తీవ్రత అపారంగా ఉండేదని హెచ్ఎ్సఎల్ వర్గాలు తెలిపాయి. నౌకల విడి భాగాలను క్రేన్తో తరలిస్తున్నప్పుడు వందమంది వరకు ఉంటారని, అప్పుడు ప్రమా దం జరిగితే ప్రాణనష్టం భారీగా ఉండేదని చెబుతున్నాయి.