ఖాతాదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా
ABN , First Publish Date - 2020-10-19T23:30:11+05:30 IST
వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ ఖాతాదారులకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. రోజువారీ ఉపయోగించగా మిగిలిన డేటాను వారాంతంలో ఉపయోగించుకునేలా ‘డేటా రోల్ ఓవర్’ను ప్రకటించింది.
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ ఖాతాదారులకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. రోజువారీ ఉపయోగించగా మిగిలిన డేటాను వారాంతంలో ఉపయోగించుకునేలా ‘డేటా రోల్ ఓవర్’ను ప్రకటించింది. రూ. 249, ఆపైన రీచార్జ్ చేయించుకునే ఖాతాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రోజువారీ డేటా ప్రయోజనాలతో అన్లిమిటెడ్ ప్యాక్స్ను ఉపయోగిస్తున్న ప్రీపెయిడ్ ఖాతాదారులకు తక్షణం ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.
వొడాఫోన్ ఐడియాలో చేరే కొత్త ఖాతాదారులకు కూడా ఇది వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. రోజువారీ డేటాలో ఉపయోగించగా మిగిలిపోయిన డేటా ఇక వృథా అవుతుందని భయపడాల్సిన అవసరం లేదని, వారాంతంలో అది తిరిగి వచ్చి చేరుతుందని వొడాఫోన్ ఐడియా మార్కెటింగ్ డైరెక్టర్ అవనీష్ ఖోస్లా తెలిపారు. వారాంతాల్లో ఎంటర్టైన్మెంట్, వీడియో కాల్స్ చేసుకునేందుకు ఈ డేటాను చక్కగా ఉపయోగించుకోవచ్చన్నారు.
వొడాఫోన్ ఐడియా వరుసగా తొమ్మిదో నెలలోనూ ఖాతాదారులను కోల్పోయింది. జులైలో ఏకంగా 3.7 మిలియన్ల మంది టెల్కోను విడిచిపెట్టారు. అదే సమయంలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు వరుసగా 3.2, 3.5 మిలియన్ల మందిని చేర్చుకున్నాయి.