‘గిడ్డంగుల’ ఎండీ, జీఎం..ఏసీబీ వలలో

ABN , First Publish Date - 2021-01-21T07:26:27+05:30 IST

ఏళ్ల తరబడి సర్కారుకు సేవలందించిన ఓ ఉద్యోగి.. తన పదవీవిరమణ ప్రయోజనాల మంజూరు కోసం నెలల తరబడి తిరిగినా లాభం లేకపోయింది. రూ.75వేలులంచం ఇవ్వనిదే ఫైలు

‘గిడ్డంగుల’ ఎండీ, జీఎం..ఏసీబీ వలలో

రిటైర్మెంట్‌ ప్రయోజనాల మంజూరుకు విశ్రాంత ఉద్యోగి నుంచి లక్ష లంచం డిమాండ్‌

బాధితుడి ఫిర్యాదుతో వలపన్నిపట్టుకున్న అధికారులు


అఫ్జల్‌గంజ్‌/మన్సూరాబాద్‌/ఎల్బీనగర్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి సర్కారుకు సేవలందించిన ఓ ఉద్యోగి.. తన పదవీవిరమణ ప్రయోజనాల మంజూరు కోసం నెలల తరబడి తిరిగినా లాభం లేకపోయింది. రూ.75వేలులంచం ఇవ్వనిదే ఫైలు కదలంటూ ఉన్నతాధికారులు బాహాటంగా చెప్పేశారు. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారాయన. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. రెడ్‌హ్యాండెడ్‌గా ఆ అధికారులను పట్టుకుని అరెస్ట్‌ చేశారు. గిడ్డంగి మేనేజర్‌ గ్రేడ్‌-1 గా పదవీవిరమణ చేసిన బానోత్‌ సుందర్‌లాల్‌కు రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే ప్రయోజనాల కోసం గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీ భాస్కరాచారి, గిడ్డంగుల శాఖ జీఎం, ఎఫ్‌ఏసీ హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం మార్క్‌ఫెడ్‌ ఎండీ సుధాకర్‌ రెడ్డిని సంప్రదించగా వారు రూ.75 వేలు లంచం డిమాండ్‌ చేశారు.


దీంతో సుందర్‌లాల్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు వారి కదలికపై నిఘా పెట్టారు.సుందర్‌లాల్‌ ఉదయం 11.50 గంటలకు సుధాకర్‌ రెడ్డి చాంబర్‌కు వెళ్లి రూ.75 వేలు అందించారు. ఏసీబీ అధికారులు వెంటనే సుధాకర్‌రెడ్డిని అదుపులో తీసుకొని కెమికల్‌ పరీక్షల అనంతరం లంచం డబ్బులు తామిచ్చినవేనని గుర్తించారు. ఎండీ భాస్కరాచారి ఆదేశాల మేరకు తాను డబ్బులు తీసుకున్నానని సుధాకర్‌ రెడ్డి చెప్పడంతో ఆయనను  కూడా అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం భాస్కరాచారి, సుధాకర్‌ రెడ్డి ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. పత్రాలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.

Updated Date - 2021-01-21T07:26:27+05:30 IST