అమరావతిని కాపాడుకుంటాం
ABN , First Publish Date - 2022-02-11T08:56:34+05:30 IST
రాష్ట్రానికి గుండె కాయ అమరావతి అని, దానిని కాపాడుకుంటామని విశాఖపట్నంలోని ఆనంద ఆశ్రమపీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి తెలిపారు.
శ్రీశైలం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర: శ్రీనివాసానంద
తుళ్లూరు, ఫిబ్రవరి 10: రాష్ట్రానికి గుండె కాయ అమరావతి అని, దానిని కాపాడుకుంటామని విశాఖపట్నంలోని ఆనంద ఆశ్రమపీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి తెలిపారు. తుళ్లూరు రైతు ధర్నా శిబిరాన్ని గురువారం ఆయన పలువురు పీఠాధిపతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ రాజధాని మహిళలు చేసిన పాదయాత్ర చారిత్రాత్మకమన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా శ్రీశైలం నుంచి శ్రీకాకుళం వరకు పాదయత్ర చేస్తామని ప్రకటించారు. విశాఖను రాజధానిగా నమ్మించి లక్షల కోట్లు దోచుకోవాలని పాలకులు చూస్తున్నారని ఆరోపించారు. దేవుడు నిర్మించి నామకరణం చేసిన అమరావతిని నాశనం చేయాలనుకోవటం అవివేకమని, రాజధాని లేకుండా చేసిన ప్రభుత్వానికి దేవుడి శాపాలు తగులుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా ఏపీ పరిస్థితిని చూసి జాలిపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.