అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ఉదేశ్యం ఏమిటి?

ABN , First Publish Date - 2020-08-11T16:34:53+05:30 IST

అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో కేంద్రం ఉదేశ్యం ఏమిటి?

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ఉదేశ్యం ఏమిటి?

న్యూఢిల్లీ: అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో కేంద్రం ఉదేశ్యం ఏమిటి? ఫిర్యాదు చేసిన రాష్ట్రాలే పట్టించుకోకపోయినా కేంద్ర వదిలిపెట్టకపోవడం వెనుక ఉన్న అర్థమేంటి? కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేఖ పరమార్థమేంటి?.. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం పరిపాలన అనుమతులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసింది. 


ఈ ప్రాజెక్టు విస్తరణవల్ల తమకు నష్టమని ఆ ప్రాజెక్టులు ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనికి కౌంటర్‌గా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు బోర్డులు సమావేశాలు ఏర్పాటు చేసి ఐదు రోజుల్లో ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని సూచించాయి. వెంటనే డీపీఆర్‌లు పంపితే అఫెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ బోర్డులకు, రెండు రాష్ట్రాలకు తెలిపింది. కానీ రెండు రాష్ట్రాలు స్పందించలేదు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వలేదు. దీంతో రెండు నెలలు చూసి కేంద్ర జలశక్తిశాఖే స్వయంగా స్పందించి ఆగస్టు 5న అఫెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి రెండు రాష్ట్రాలు విముఖత వ్యక్తం చేశాయి. 5న వీలుకాదని, 20వ తేదీ తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి అంగీకరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ అపెక్ష్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసింది.

Updated Date - 2020-08-11T16:34:53+05:30 IST