అభివృద్ధి ఆనవాళ్లపై వైసీపీ దాష్టీకం

ABN , First Publish Date - 2020-12-01T09:03:21+05:30 IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడులో టీడీపీ ఆర్చి(ముఖద్వారాన్ని)ని వైసీపీ కార్యకర్తలు

అభివృద్ధి ఆనవాళ్లపై వైసీపీ దాష్టీకం

నుదురుపాడులో టీడీపీ ముఖద్వారం కూల్చివేత


ఫిరంగిపురం, నవంబరు 30: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడులో టీడీపీ ఆర్చి(ముఖద్వారాన్ని)ని వైసీపీ కార్యకర్తలు సోమవారం జేసీబీతో కూల్చి వేశారు. స్థానిక వైసీపీ నేతలు కర్రలు చేతబూని కేకలు వేస్తూ కూల్చివేతలో పాల్గొన్నారని గ్రామ టీడీపీ నాయకులు గుర్రాల శివయ్య, వెలిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో 2017లో పక్కా గృహాలు నిర్మించి రూ.50 లక్షలతో రోడ్డు వేశారు. రహదారి మొదట్లో ద్వారం నిర్మించి, దానిపై ఎన్టీఆర్‌, చంద్రబాబు చిత్రాలను ఏర్పాటు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాన్ని పడగొట్టాలని స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.


అయినప్పటికీ ద్వారాన్ని కూల్చివేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పసల థామస్‌ డిమాండ్‌ చేశారు. కాగా ఇదే మండలంలోని పొనుగుపాడులో టీడీపీ వర్గీయులు నడిచే దారికి అడ్డంగా వైసీపీ వర్గీయులు గోడ కట్టేశారు. అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆ సంఘం పర్యటించింది. ఇప్పుడు ఇదే మండలంలో మరో ఘటన చోటుచేసుకుంది.

Updated Date - 2020-12-01T09:03:21+05:30 IST