కుప్పంలో సీఐపై వైసీపీ నేత దౌర్జన్యం
ABN , First Publish Date - 2021-10-23T08:39:26+05:30 IST
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఐ పట్ల వైసీపీ నేత దురుసుగా ప్రవర్తించారు. శాంతిపురం మం డలం వైసీపీ కన్వీనర్ కోదండరెడ్డి..
కుప్పం, అక్టోబరు 22: చిత్తూరు జిల్లా కుప్పంలో సీఐ పట్ల వైసీపీ నేత దురుసుగా ప్రవర్తించారు. శాంతిపురం మం డలం వైసీపీ కన్వీనర్ కోదండరెడ్డి.. కుప్పం అర్బన్ సీఐ సాదిక్ అలీ షర్టు పట్టుకుని నెట్టేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే ఆయనను పక్కకు నెట్టేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ సెంధిల్ కుమార్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు వస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు వాదనకు దిగారు. అక్కడికి సమీపంలో జనాగ్రహ దీక్షలో ఉన్న వైసీపీ నేతలు వెంటనే టీడీపీ నాయకులపైకి దూసుకువచ్చారు. ఇరు పక్షాల నేతలూ బాహాబాహీకి దిగడంతో కుప్పం పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైసీపీ నేత కోదండరెడ్డి.. సీఐ సాదిక్ అలీ చొక్కా పట్టుకున్నారు. చివరకు రోడ్డుపైనే పోలీసులు టీడీపీ నేతల వద్ద ఫిర్యాదు స్వీకరించి వారిని పంపేశారు. కాగా గురువారం కుప్పంలో వైసీపీ నిర్వహించిన జనాగ్రహ దీక్షలో సెంధిల్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ల.. కొడకల్లారా’ అంటూ పదేపదే వ్యాఖ్యానించారు. తమ నేత పెద్దిరెడ్డి జోలికొస్తే కారుపై బాంబు వేస్తానని హెచ్చరించారు.