జగన్తో వాసుపల్లి భేటీ తర్వాత విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-09-19T21:19:42+05:30 IST
విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
అమరావతి : విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో వాసుపల్లి కుమారులు వైసీపీలో చేరారు. ఈ చేరిక అనంతరం ఎంపీ, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డితో కలిసి వాసుపల్లి మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాసుపల్లి గణేష్ కుటుంబం విశాఖ ప్రజలకు ఎంతో సేవ చేస్తోందన్నారు. గణేష్ వైసీపీలోకి రావడంతో పార్టీకి కొండంత బలం వచ్చిందని.. జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ పథకాలను చూసి ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నారని ఎంపీ చెప్పుకొచ్చారు. భవిష్యత్లో వైసీపీలో మరిన్ని చేరికలు ఉంటాయని విజయసాయి అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా తేడా లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రతిపక్షమే ఉండదని.. ఇక నాయకుడు ఎలా ఉంటాడు? అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. తన కుమారులు వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు.