పీఆర్సీపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలకు కొత్త సవాల్

ABN , First Publish Date - 2022-01-23T21:25:59+05:30 IST

పీఆర్సీపై వెనక్కి తగ్గని ఉద్యోగులను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది.

పీఆర్సీపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలకు కొత్త సవాల్

అమరావతి: పీఆర్సీపై వెనక్కి తగ్గని ఉద్యోగులను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. ఉద్యోగులను కించపరుస్తూ పోస్టులతో తెగబడ్డాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అసలు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పీఆర్సీపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలకు కొత్త సవాల్ ఎదురైంది. వైసీపీ సోషల్ మీడియాలో తమపై పెడుతున్న పోస్టులకు సంబంధించి ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులను కించపరిచే విధంగా కూడా కొన్నిపోస్టింగులు పెట్టడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. వాటిని తిప్పికొడతామని, త్వరలోనే ఆ ప్రభావం ఏంటో తెలుస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.


రాష్ట్ర ఖజానా మొత్తాన్ని మీకు దోచిపెట్టాలా అంటూ ఉద్యోగులను ఉద్దేశించి వైసీపీ పేటీఎం బ్యాచ్ పోస్టులు పెడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలను ఉద్యోగుల కోసం ఆపేయాలా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఐఆర్ ఇవ్వడమే కాకుండా పోలీసులకు వీక్లీ ఆఫ్, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచిన వైనంపై కూడా పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఆ పోస్టులపై తాము సైలెంట్‌గా ఉన్నా.. ఉద్యోగులు మాత్రం చూస్తూ ఊరుకోరని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

Updated Date - 2022-01-23T21:25:59+05:30 IST