‘దేశం’ మద్దతుదారులపై వైసీపీ దాడి

ABN , First Publish Date - 2021-09-18T08:35:45+05:30 IST

‘దేశం’ మద్దతుదారులపై వైసీపీ దాడి

‘దేశం’ మద్దతుదారులపై వైసీపీ దాడి

కోడెల వర్ధంతికి వెళ్తారా అంటూ కొట్టిన వైనం

ముప్పాళ్ల, సెప్టెంబరు 17: ‘‘పంచాయతీ ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పోటీ చేస్తారా! కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలకు వెళ్తారా?’’ అంటూ వైసీపీ వర్గీయులు టీడీపీ మద్దతుదారులపై దాడి చేశారు. ఇళ్లలోకి వెళ్లి లాక్కొచ్చి మరీ దారుణంగా కొట్టారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం నకరికల్లు మండలం కండ్లకుంటలో జరిగిన మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభకు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైన ఎస్సీ కాలనీ వాసులు వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు గురువారం సాయంత్రం టీడీపీ కార్యకర్తలతో వాదనకు దిగారు. జరిగిన తోపులాటలో ఇరువర్గాలకూ స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇరువర్గాలను పంపించేశారు. శుక్రవారం ఉదయం వైసీపీకి చెందిన పలువురు మాపైనే  దాడికి దిగుతారా? అంటూ టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడిచేశారు. ఇళ్లలో ఉన్నవారిని భయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. దాడిలో బోరుపోతు మేరిమ్మ, బోరుపోతు నాగేశ్వరరావు, బోరుపోతు హనుమంతరావు, గోవింద్‌ నాగమణి, సందిపోగు చంద్రలీలకు తీవ్రగాయాలయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ వర్గీయులకు వ్యతిరేకంగా టీడీపీ మద్దతుతో పోటీ చేశామని, అప్పటి నుంచి తమపై గొడవ పడుతూనే ఉన్నారని బాధితులు తెలిపారు. కోడెల శివప్రసాదరావు వర్ధంతికి వెళ్లటంతో కావాలనే తమపై గొడవపెట్టుకొని మరీ దాడిచేశారని బాధితులు ఆరోపించారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గ్రామంలో పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-09-18T08:35:45+05:30 IST