ఆ ప్రచారంపై విచారణ జరపాలి: వైవీ సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2020-05-28T22:35:28+05:30 IST
టీటీడీ ఆస్తులు విక్రయిస్తున్నారన్న ప్రచారంపై విచారణ జరపాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
తిరుమల: టీటీడీ ఆస్తులు విక్రయిస్తున్నారన్న ప్రచారంపై విచారణ జరపాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పాలకమండలిపై మరోసారి ఆరోపణలు రాకుండా చూడాలన్నారు.
తిరుమలలో అతిథి గృహాల కేటాయింపులో పారదర్శకత ఉంటుందని చెప్పారు. పాత అతిధి గృహాలు పునర్నిర్మించేందుకు మాత్రమే అనుమతి ఉందన్నారు. డోనేషన్ విధానంలో నూతన విధానాన్ని రూపొందించాలని ఆదేశించామని ఆయన తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల ఆస్పత్రి ప్రారంభిస్తామని తెలిపారు. తిరుమలలో పాత కాటేజీల కేటాయింపుపై అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. లాక్డౌన్ నిబంధనలు తొలగించాక భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు.