పిల్లలతో సహా ఎల్లెల్సీలో దూకిన మహిళ

ABN, First Publish Date - 2023-01-13T00:36:47+05:30 IST

ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ మహిళ కర్ణా టకలోని ఎల్లెల్సీలో దూకింది.

ఏడాది చిన్నారి మృతి

మరో బాలికను కాపాడిన స్థానికులు

తల్లి కోసం గాలింపు

ఆలూరు, జనవరి 12: ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ మహిళ కర్ణా టకలోని ఎల్లెల్సీలో దూకింది. ఈ ఘటనలో ఏడాది చిన్నారి మృతి చెందింది. మరో బాలికను స్థానికులు కాపాడారు. తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బంధువుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లాహొళగుంద మండలం బీజీహళ్లికి చెందిన లక్ష్మికి ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామానికి చెందిన వీరభద్రితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి నలుగురు కూతుళ్లు సంతానం. కొన్ని రోజులు అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితంలో కలహాలు మొదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి(32) ఆవేశంతో ఇద్దరు కూతుళ్లు వెన్నెల, శాంతిలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉంటుందని భర్త, బంధువులు అనుకున్నారు. కానీ లక్ష్మి, కర్ణాటకలోని ఎర్రగుడి సమీపంలో ఉన్న ఎల్లెల్సీలో ఇద్దరు కూతుళ్లతో కలిసి దూకేసింది. స్థానికులు గమనించి వెంటనే మూడేళ్ల చిన్నారి వెన్నెలను కాపాడారు. మరో ఏడాది చిన్నారి శాంతిని బయటకు తీసినా అప్పటికే మృతి చెందింది. తల్లి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ ఘటనతో హత్తిబెళగల్‌ గ్రామంలో విషాదం అలుముకుంది.

Updated at - 2023-01-13T00:36:47+05:30