Share News

UAE: యుఏఈలో ‘తెలుగు తరంగిణి’ ఉగాది ఉత్సవం

ABN , Publish Date - Apr 15 , 2024 | 03:24 PM

రాస్ అల్ ఖైమాలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.

UAE: యుఏఈలో ‘తెలుగు తరంగిణి’ ఉగాది ఉత్సవం
Telugu Tarangini Ugadi Celebrations

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఇతర ఎమిరేట్స్‌లతో పోల్చితే తెలుగు వారి (NRI) ఆధ్యాత్మికత, సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రస్ఫుటంగా ప్రతిబింబించే రాస్ అల్ ఖైమాలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.

సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలతో రాస్ అల్ ఖైమాలోని ఇండియన్ అసోసియేషన్ తెలుగు నేలను మరిపించింది. శ్లోకాల పఠనం మొదలు కవిత్వం, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల వరకు వైవిధ్యభరితంగా ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్నారులు, స్త్రీల ఆటపాటలతో నూతన వసంతం విరబూసినట్లయ్యింది.

అంగరంగ వైభవంగా దినమంతా జరిగిన ఈ కార్యక్రమంలో ఇటు దుబాయి మొదలు అరేబియా సముద్రం తీరంలోని అల్ దరా వరకు ఉన్న అనేక మంది తెలుగు ప్రవాసీయులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. అతిథుల వాహానాల పార్కింగ్ ఒక దశలో స్థానికులను అసహనానికి గురిచేసింది.

NRI: దుబాయిలో క్రెడిట్ కార్డు బాధితుడికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకుడు

5.jpg


దశాబ్ద కాలం క్రితం కేవలం ఎనిమిది తెలుగు కుటుంబాలతో ప్రారంభమైన తెలుగు తరంగిణి ప్రస్తుతం వేయికి పైగా కుటుంబాలతో యుఏఈ వ్యాప్తంగా తన తరంగాలను ప్రసరిస్తోందని సంస్థ అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేశ్ తన ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు, వినోదభరిత కార్యక్రమాలకు తోడుగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అనేక సహాయక, సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లుగా వివరించారు. అందరి కలిసికట్టు కృషి వలన యూఏఈలో ప్రస్తుతం తెలుగు సమాజం ఒక గౌరవప్రదమైన గుర్తింపు పొందడం వెనుక తెలుగు తరంగిణి పాత్ర కూడా ఉందని వెంకట సురేశ్ పేర్కొన్నారు.

శ్రీ క్రోధి నామ సంవత్సర రాశిఫలాలు, స్థితిగతులను గురించి స్థానిక పురోహితులు ముకుంద్ కౌశిక్ వివరిస్తుండగా ఆలయంలో కూర్చొని పంచాంగం విన్న అనుభూతి కల్గింది. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వార పుణ్యాన్ని పొందుతారని కౌశిక్ వివరించారు.

ఉగాదితో పాటు ఈద్ మిలాప్ కార్యక్రమం కూడా జరిగినందున రంజాన్ ప్రాముఖ్యత గురించి మీర్జా గుల్జార్ బేగ్ వివరించారు. దుబాయి సహా దేశవ్యాప్తంగా తెలుగు చిన్నారులు మరియు ఔత్సాహిక తెలుగు నృత్యకారిణులతో ప్రవాసంలో తెలుగు కళామ్మతల్లి సేవకు అంకితమైన విశాఖపట్టణానికి చెందిన విమల ఫ్లోరెన్స్ నేతృత్వంలోని తెలుగు ప్రిటి ఉమెన్ గ్రూప్‌ను ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు. స్థానిక విమల బృందం చేసిన నృత్య ప్రదర్శనలు సభికులను అలరింపజేసాయి.

10.jpg


అదే విధంగా, ఎమిరేట్స్‌లో నృత్య కళల వైభవం కోసం పాటుపడుతున్న ప్రీతి తాటంభోట్లను ప్రవాసీ నాట్య మయూరి అవార్డుతో, వ్యాపారవేత్త సంపంగి రమేశ్‌ను ప్రవాసీ తెలుగు మిత్ర అవార్డుతో సత్కరించారు.

ఉగాది పచ్చడిని ఆత్మీయులతో పంచుకోవాలంటారు. అందుకే హంసవేణి, తనూజ, జ్యోతి, శ్రీ రంజనీ, లక్ష్మీలు రేయింబవళ్ళు కష్టపడి చేసిన ఉగాది పచ్చడి ఆరు రుచులు ఆయుర్వేదంలో వివరించినట్లుగా మూడు దోషాల సమతౌల్యం చేసే విధంగా సరిపోయింది. హర్షిత, భార్గవి, జశ్విత, పూర్వీనందన, లక్ష్మి ప్రసన్న, అంజన సంధ్య, భావికల ప్రార్ధన గేయాలతో ప్రారంభమైన కార్యక్రమాన్ని ఫన్, జబర్దస్త్ సాంస్కృతిక బృందానికి చెందిన బిగ్ బాస్ ఫైమా, మోనిక యాదవ్, సిద్ధార్ధ్ వాట్కిన్స్, బుల్లెట్ భాస్కర్, నౌటి నరేష్,సునామీ సుధాకర్ ల వినోదభరిత కార్యక్రమాలు రంజింపచేసాయి.

కార్యక్రమ నిర్వహణను ఉపాధ్యక్షులు చిరుతనగండ్ల శ్రీనివాస రావు, కోశాధికారి చాముర్తి రాజేష్, కార్యదర్శి కోకా దత్యానంద, కార్యవర్గ సభ్యులు రామ శేషు, దిరిశాల ప్రసాద్, వీరభద్రరావు, అనిల్, బ్రహ్మనంద, శివానందరెడ్డి, కేదార్, సురేఖ పట్నం అంకోరింగ్, డాక్టర్ రాఘవేంద్ర, విజయ, కళ్యాణ్ తదితరులు ఓర్పుగా సమన్వయం చేసారు.

9.jpg


ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన సంపంగి న్యాచురల్స్ అనే సంస్థ చేస్తున్న ఆకర్షణీయ వ్యవసాయ విధానం, ఎగుమతులకు అనువైన ఖర్జూరం, పప్పు దినుసుల పంటల గురించి ప్రత్యేకంగా వివరించారు. వ్యవసాయ క్షేత్రాలలో పెట్టుబడుల వలన కలిగే లాభాల గురించి సంపంగి నిర్వాహకులు విశదీకరించారు.

ఎడారి నాట నిరంతర ప్రక్రియగా కొనసాగే ప్రవాస ప్రహాస మజిలీలో మలుపులు అనేకం. ఉపాధి కోసం వచ్చి ఉద్యోగంలో నిలదొక్కలేక కొందరు మెరుగయిన ఆవకాశాలు కోసం, మరికొందరు వ్యక్తిగత కారణాల రీత్యా తిరిగి వెళ్ళే వారు కూడా ఉంటారు. ఈ పరిస్థితులలో పరాయిగడ్డపై తెలుగు వారందర్నీ కలుపుకొంటూ తెలుగు సంస్కృతి వికాసం, సంక్షేమానికి ఆపన్న హస్తం ఇవ్వడానికి మాతృభాషపై మమకారంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దశాబ్దకాలంగా క్రీయాశీలకంగా తన వంతు పాత్ర పోషిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రవాసీ తెలుగు సంఘమైన ‘తెలుగు తరంగిణి’ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. మరిన్ని వివరాలకై 0563988975 నెంబర్‌పై సంప్రదించవచ్చు.

8.jpg7.jpg6.jpg3.jpg2.jpg1.jpg11.jpg

Updated Date - Apr 15 , 2024 | 04:28 PM