Share News

Lok Sabha Polls 2024: బీజేపీ దెబ్బకు.. పాత బస్తీలో కొత్త దోస్తీ!

ABN , Publish Date - Apr 27 , 2024 | 06:12 AM

బీజేపీ (BJP) దెబ్బకు పాత బస్తీలో బద్ధ శత్రువులు ఏకమయ్యారా!? ఇక్కడ ఎంఐఎంకు ఎంబీటీ పరోక్ష మద్దతు ఇస్తోందా!? మజ్లిస్‌కు (AIMIM)సహకరించడానికే పోటీ నుంచి తప్పుకుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి తాజా పరిణామాలు..

Lok Sabha Polls 2024: బీజేపీ దెబ్బకు.. పాత బస్తీలో కొత్త దోస్తీ!

  • పార్లమెంటు బరి నుంచి తప్పుకొన్న ఎంబీటీ

  • ఈ పరిణామంతో భారీగా లాభపడనున్న మజ్లిస్‌

  • ముస్లిం ఓట్లు చీలకుండా చేసే ఎత్తుగడగా ప్రచారం

  • బీజేపీ అభ్యర్థి మాధవీలత దెబ్బకు ఏకమైన శత్రువులు!?

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): బీజేపీ (BJP) దెబ్బకు పాత బస్తీలో బద్ధ శత్రువులు ఏకమయ్యారా!? ఇక్కడ ఎంఐఎంకు ఎంబీటీ పరోక్ష మద్దతు ఇస్తోందా!? మజ్లిస్‌కు (AIMIM)సహకరించడానికే పోటీ నుంచి తప్పుకుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి తాజా పరిణామాలు. ఈసారి హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయడం లేదని శుక్రవారం ఎంబీటీ ప్రకటించింది. మతతత్వ పార్టీలకు తాము సహకరించేది లేదని, అందుకే పోటీ నుంచి తప్పుకొంటున్నామని ఎంబీటీ నేత ఫర్హతుల్లా ప్రకటించారు. సెక్యులర్‌ పార్టీకి తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. తప్పితే, ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అలాగే, మతతత్వ పార్టీ అని ఆయన బీజేపీని ఉద్దేశించే అన్నారా!? లేక మజ్లిస్‌ను కూడా కలిపారా!? అన్న విషయంపైనా స్పష్టత లేదు. పోటీకి దూరంగా ఉంటామని ఎంబీటీ ప్రకటించానికి కారణాలు ఏవైనా.. పరోక్షంగా ఈ పరిణామంమజ్లిస్‌కే లబ్ధి చేకూర్చనుంది.

Asaduddin-Vs-Madhavi-Latha.jpg

ముస్లిం ఓట్లు చీలకుండా..!

ఓటమి ఎరుగని నాయకునిగా, రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌ ఎంపీగా ఉన్న అసదుద్దీన్‌ ఒవైసీకి ఈసారి ఎన్నికలు కత్తి మీద సాముగా మారాయి. బరిలోకి దిగితే విజయం ఖాయమనే ధీమా ఇప్పటి వరకూ ఉండగా.. ఈసారి పరిస్థితులు మారుతున్నాయి. ఇందుకు కారణం బీజేపీ అభ్యర్థి మాధవీలత. ఎన్నికల నగారా మోగిన వెంటనే బీజేపీ తమ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించింది. తొలుత మజ్లిస్‌ వర్గాలు ఆమె పోటీని అంత సీరియ్‌సగా తీసుకోలేదు. అదే సమయంలో రంజాన్‌ మాసం రావడంతో ప్రచారమూ ప్రారంభించలేదు. కానీ, మాధవీలత పాతబస్తీలో గల్లీ గల్లీ చుట్టేశారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోలే. హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసే ప్రయత్నాలతోపాటు పాత నగరంలోనూ ప్రచార హోరు పెంచారు. మహిళ కావడం.. ఇంటింటికీ తిరగడం.. ఆమె ప్రచార తీరు కారణంగా కొంతమంది ముస్లిమ్‌ ఓటర్లు కూడా మాధవీలత వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ పరిణామమే మజ్లిస్‌ వర్గాల్లో ఆందోళనకూ కారణమైంది. ఇందుకు కారణం లేకపోలేదు.

Madhavi-Old-City.jpg


ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్లమెంటు స్థానంలో గత ఎన్నికలతో పోలిస్తే మజ్లి్‌సకు దాదాపు లక్ష ఓట్లు తగ్గాయి. ముస్లిం ఓటర్లే మజ్లి్‌సకు దూరమవుతున్నారనే సంకేతాలు ఆ ఫలితాలు వెల్లడించాయి. ఇక, యాకత్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే మజ్లిస్‌, ఎంబీటీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కేవలం 878 ఓట్ల తేడాతో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లాఖాన్‌ ఓడిపోయారు. యాకత్‌పుర పరిస్థితి పునరావృతమైతే.. మజ్లి్‌సకు చుక్కలు కనిపించడం ఖాయం. పార్లమెంటు ఎన్నికల బరిలో మజ్లిస్‌, బీజేపీతోపాటు ఎంబీటీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కూడా ఉంటాయి. కాంగ్రెస్‌ ముస్లిం వర్గానికే టికెట్‌ ఇచ్చింది. ఇక, ఎంబీటీ కూడా బరిలో ఉంటే ముస్లిం ఓట్లలో చీలిక తథ్యం.

అదే జరిగితే, మజ్లిస్‌ కంచుకోటకు బీటలు వారడాన్ని కొట్టివేయలేం. ఈ నేపథ్యంలోనే, కొందరు మత పెద్దలు రాయబారాలు నడిపారని, ఎంబీటీని పోటీ నుంచి తప్పుకునేలా చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో త్యాగం చేస్తే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో యాకత్‌పురాలో సహకరిస్తామనే చర్చలు జరిగినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాటి ఫలితమే, బరి నుంచి ఎంబీటీ తప్పుకోవడమనే అభిప్రాయం వెలువడుతోంది. మజ్లిస్‌ ఓటమి కంటే కూడా పాత బస్తీలో బీజేపీ ఓటమి కోసమే ఎంబీటీ సీటును త్యాగం చేసిందనే వాదన రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అంతేనా.. అసదుద్దీన్‌ సహా మజ్లిస్‌ ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో తిరుగుతుండడం.. డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు, సిమెంటు రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రుల వంటి అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుండడాన్ని అక్కడ మారిన పరిస్థితులకు తార్కాణంగా చెబుతున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 09:24 AM