Share News

KCR : ఇస్మార్ట్‌ కేసీఆర్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:19 AM

బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సామాజిక మాధ్యమాల్లోకి అడుగుపెట్టారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలను ప్రారంభించారు

KCR : ఇస్మార్ట్‌ కేసీఆర్‌

  • ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో గులాబీ నేత ఖాతాలు

  • పాలమూరులో భోజనంచేస్తుండగా కరెంట్‌ కట్‌!

  • విద్యుత్తు కోతలపై ప్రభుత్వంపై విమర్శలతో ట్వీట్‌

  • కరెంటు కట్‌ అసత్య ప్రచారమన్న మంత్రి భట్టి

  • సీఎం జిల్లాలోనూ కాంగ్రెస్‌ గెలవదు

  • అందుకే ఇన్‌చార్జి పదవి నుంచి రేవంత్‌ వైదొలిగారు

  • నేను మళ్లీ చెబుతున్నా.. ఆయన బీజేపీలో చేరుతారు

  • ఈటల అంశంలో వ్యూహాత్మకంగానే మల్లారెడ్డి వ్యాఖ్య

  • తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌

  • మోదీకి ఓటేస్తే వినాశనమే

  • ఇస్మార్ట్‌ కేసీఆర్‌..!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సామాజిక మాధ్యమాల్లోకి అడుగుపెట్టారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలను ప్రారంభించారు. 24 ఏళ్ల క్రితం(2011 ఏప్రిల్‌ 27న) హుస్సేన్‌సాగర్‌ తీరంలోని జలదృశ్యంలో బీఆర్‌ఎ్‌స(అప్పట్లో టీఆర్‌ఎస్‌) ఆవిర్భావ సభ ఫొటోను ఎక్స్‌, ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మరో రెండు ట్వీట్లు చేయగా.. చివరి పోస్టు విద్యుత్తు అంతరాయాలకు సంబంధించినది.


‘‘బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు’’ అంటూ రెండో ట్వీట్‌ చేశారు. మూడో ట్వీట్‌లో.. ‘‘తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి.. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది.

ప్రతి రోజూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడంలేదని ఊదరగొడుతున్నారు. నాతో పాటు ఉన్న మాజీ శాసన సభ్యులు వారివారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ పాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


కేసీఆర్‌ది అసత్య ప్రచారం: భట్టి

కరెంట్‌ కట్‌పై కేసీఆర్‌ది అసత్య ప్రచారమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఆరోపణపై అధికారులతో విచారణ జరిపించగా.. అవాస్తవమని తేలిందని పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఇంటికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరిగినట్లు తెలిపారు.

మాజీ సీఎం నిద్ర లేచింది మొదలు అభూతకల్పనలు, అవాస్తవాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ‘సూర్యాపేటలోనూ ఇదే విధంగా విద్యుత్తు శాఖను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో అసత్యాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి అసత్యాలను చట్టప్రకారం ఎదుర్కొంటాం’ అని వివరించారు. కాగా మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఇంటి పరిసరాల్లో కరెంట్‌ కట్‌ జరగలేదని దక్షిణ డిస్కమ్‌ మహబూబ్‌నగర్‌ ఎస్‌ఈ(ఆపరేషన్స్‌) తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 06:56 AM