ఐసీడీఎస్ పీడీ సరెండర్
ABN , First Publish Date - 2020-11-19T05:57:18+05:30 IST
మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ చిన్మయదేవిని కలెక్టర్ గంధం చంద్రుడు బుధవారం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ పరిణామం ఆ శాఖలో ఓ కుదుపు కుదిపేసింది. శాఖలో అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ కన్నెర్రజేశారు.
శాఖలో అక్రమాలు, నిర్లక్ష్యంపై కలెక్టర్ కన్నెర్ర
జేసీ సిరికి పూర్తి అదనపు బాధ్యతలు
అనంతపురం వైద్యం, నవంబరు 18: మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ చిన్మయదేవిని కలెక్టర్ గంధం చంద్రుడు బుధవారం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ పరిణామం ఆ శాఖలో ఓ కుదుపు కుదిపేసింది. శాఖలో అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ కన్నెర్రజేశారు. ఈ నేపథ్యంలోనే పీడీని సరెండర్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ మేరకు పౌష్టికాహారం అందట్లేదనీ, కోడిగుడ్లు సరఫరా చేయకున్నా.. చేసినట్లు చూపించారన్న విమర్శలు వచ్చాయి. కదిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఓడీ చెరువు, నల్లమాడ, అమడగూరుతోపాటు ధర్మవరం ప్రాజెక్టు పరిధిలో ముదిగుబ్బ ప్రాంతాల్లో కోడిగుడ్లు సర ఫరా చేయకుండానే కాంట్రాక్టర్లు చేసినట్లు చూపించారని ఇందుకు అధికారులు కూడా ఆమోదం వేశారన్న ఆరోపణ లు వచ్చాయి. దీనిపై విచారణ చేయాలని కలెక్టర్తోపా టు జేసీ సిరి ఆదేశించారు. ఈ విచారణ విషయంలో పీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కలెక్టర్ ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో అంగన్వాడీల నోటిఫికేషన్ జారీలో ఖాళీలు, పోస్టులకు రోస్టర్ కేటాయింపులో నిబంధనలు పాటించకుండా తప్పులతడకగా ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రజాప్రతినిధులు సైతం ఫిర్యాదు చేసి నట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు పరిశీలించారు. ఆ సమయంలో సరైన సమాచారం లేకపోవటంతో ఐసీడీఎస్ శాఖ తీరుపై మండిపడ్డారు. ఈ పరిస్థితిలో పీడీ చిన్మయదేవి అనారోగ్య కారణాలు చూపి ఎమర్జెన్సీ పేరుతో కలెక్టర్ అనుమతి లేకుండా 15 రోజుల పాటు సెలవులో వెళ్లిపోయారు. దీంతో కలెక్టర్ ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీడీఎస్ పీడీగా పూర్తి అదనపు బాధ్యతలను జేసీ డాక్టర్ సిరికి అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.