కంటైన్మెంట్ జోన్లు 68
ABN , First Publish Date - 2020-05-18T11:14:30+05:30 IST
మరో రెండువారాల పాటు లాక్డౌన్ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఆయా ప్రాంతాల్లో మరో రెండు వారాలు లాక్డౌన్
అత్యవసర సేవలు
మినహా మిగతావన్నీ నిషేధం
నేడు రాష్ట్ర ప్రభుత్వ కొత్త మార్గ దర్శకాలు!
జోన్ల విభజనకు అధికారుల కసరత్తు
మరో రెండువారాల పాటు లాక్డౌన్ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు నమోదైన కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు అధికారం రాష్ట్రాలకే అప్పగించింది. ఈ జోన్లలో అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటిని నిషేధించనున్నారు. జిల్లాలోని 31 మండలాల్లో 68 కంటైన్మెంట్ జోన్లుండగా, మరో నాలుగు మండలాల్లో ఏడు జోన్లు ఉన్నా, ఇక్కడ అన్నీ అజ్మీర్ కేసులే కావడంతో పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఆదివారంతో మూడో విడత లాక్డౌన్ పూర్తయిన నేపథ్యంలో సోమవారం నుంచి కొనసాగే నాలుగో విడతలో అమలు చేయాల్సిన నిబంధనల గురించి కేంద్రం రాష్ట్రాలతో చర్చించింది. ఆ మేరకు కేంద్ర కేబినేట్ సెక్రటరీ ఆదివారం రాత్రి అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కరోనా కేసుల సంఖ్య ఆధారంగా ఆయా జిల్లాల్లోని ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు మునుపటిలాగే కొనసాగనున్నాయి.
రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ల కోసం కసరత్తు
- కరోనా కేసుల సంఖ్యను బట్టి రెడ్, ఆరంజ్, కంటైన్మెంట్, బఫర్ జోన్ల సరిహద్దులను నిర్ణయించే బాధ్యత జిల్లా యంత్రాగానికే ప్రభుత్వం అప్పగించింది.
- కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ నిషేధించనున్నారు
- ప్రస్తుతం నాలుగు కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్జోన్గా, అంతకంటే తక్కువగా ఉంటే ఆరంజ్ జోన్గా, కేసులు నమోదుకాని ప్రాంతాలను గ్రీన్జోన్లుగా పరిగణిస్తున్నారు.
- రెడ్జోన్లు: జిల్లాలో తిరుపతి అర్బన్, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, వరదయ్యపాళెం, సత్యవేడు, నాగలాపురం, నగరి, వి.కోట మండలాలు రెడ్జోన్లుగా ఉన్నాయి.
- ఆరంజ్ జోన్లు: ములకలచెరువు, వాయల్పాడు, మదనపల్లె, రామసముద్రం, రామకుప్పం, బైరెడ్డిపల్లె, పలమనేరు, గుడిపాల, చిత్తూరు, తవణంపల్లె, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, తిరుపతి రూరల్, వడమాలపేట, రేణిగుంట, ఏర్పేడు, పుత్తూరు, నిండ్ర, విజయపురం మండలాలు ఆరంజ్ జోన్లుగా ఉన్నాయి.
- ఇప్పటి వరకు ఒక్క కేసూ నమోదు కాని మండలాలను గ్రీన్ జోన్లుగా పరిగణిస్తున్నారు.
బస్సు సర్వీసులు..అంతర్రాష్ట్ర బస్సు
- సర్వీసులు, వాహన ప్రయాణికులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తుది నిర్ణయం రాష్ట్రానిదే అవడంతో, మన జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండడం సమస్య వస్తోంది. ఈ కారణంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులతోపాటు జిల్లాలో కూడా ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం లేదు.
- ఆ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేయనుంది.