పిట్టల్లా రాలిపోతున్నాయి
ABN , First Publish Date - 2020-02-12T08:35:32+05:30 IST
బ్రాయిలర్ కోళ్లకు వీవీఎన్డీ వైరస్ సోకింది. వైరస్ వ్యాపించిన గంటల వ్యవధిలోనే మృత్యువాతపడుతున్నాయి. జిల్లాలోని పలు
బ్రాయిలర్ కోళ్లకు వీవీఎన్డీ వైరస్
సోకిన గంటల వ్యవధిలోనే మృత్యువాత
ఖాళీ అవుతున్న కోళ్ల ఫారాలు
ఆందోళనలో రైతులు
ఆలమూరు, ఫిబ్రవరి 11: బ్రాయిలర్ కోళ్లకు వీవీఎన్డీ వైరస్ సోకింది. వైరస్ వ్యాపించిన గంటల వ్యవధిలోనే మృత్యువాతపడుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ వైరస్ వ్యాపించినట్టు గుర్తించారు. దీంతో కోళ్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరస్ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలై అక్కడి నుంచి జిల్లాకు వ్యాప్తించినట్టు తెలుస్తోంది. ఆలమూరు మండలం బడుగువానిలంకలో యెరుబండి ప్రసాద్కు చెందిన 2,300 కోళ్లు సోమ, మంగళవారాల్లో చనిపోయాయి. రైతుకు రూ.6 లక్షలు నష్టం వాటిల్లింది. దీనిని బట్టి వ్యాధి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం మృతి చెందిన కోడి నుంచి ఆ ఫారంలో ఉన్న కోళ్లకు గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని కోళ్ల వైద్య నిఫుణులు చెప్తున్నారు. కోళ్లలో సాధారణంగా ఈ వ్యాధి సంభవిస్తుందని, దీని వల్ల ఇబ్బందులేమీ ఉండవని చెప్తున్నారు. ఒకపక్క కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో కోళ్లకు సంభవించిన ఈ వైరస్తో చికెన్ తినడానికి మాంసాహారప్రియులు భయపడుతున్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా కోళ్లకు వీవీఎన్డీ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఆత్రేయపురం మండలం వద్దిపర్రులోని రెండు కోళ్లఫారాల్లో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందినట్టు రైతులు తెలిపారు. వెలిచేరు, ఇతర గ్రామాల్లో కూడా ఈ వైరస్తో కోళ్లు చనిపోవడంతో కోళ్ల ఫారాలన్నీ ఖాళీ అయ్యాయి. ఈ కారణంగా రైతులు సుమారు రూ.25 లక్షల దాకా నష్టపోయినట్టు సమాచారం. అయితేఈ వ్యాధి బయటకు రాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీవీఎన్డీ వైరస్ సోకిన కోళ్లు మెడ, కాళ్లు, వంకర తిరుగుతాయని జొన్నాడ పశువైద్యాధికారి భానుప్రకాష్ తెలిపారు. ఈ వ్యాధి గాలి ద్వారా అధికంగా వ్యాప్తి చెందుతుందన్నారు. బ్రాయిలర్, ఫారం కోళ్లకు సకాలంలో టీకాలు వేయించపోవడం వల్ల వైరస్ వస్తుందని, ఈ వ్యాధి సోకిన కోళ్లు రెండు నుంచి ఏడు రోజులలోపు మృత్యువాతపడతాయని చెప్పారు. చనిపోయిన కోళ్లను గోతిలో పూడ్చాలన్నారు.. మాంసాన్ని 100 డిగ్రీల వేడిలో ఉడికించి తినడం వల్ల ప్రజలకు ఎటువంటి ప్రమాదం ఉండదని ఆయన వివరించారు.