కరోనా కలకలం!
ABN , First Publish Date - 2020-03-15T09:19:23+05:30 IST
ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న కోవిడ్-19 (కరోనా వైరస్) మండల కేంద్రమైన
మలికిపురంలో ఓ వ్యక్తికి అనారోగ్య లక్షణాలు
విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిని గుర్తించిన అధికారులు
జీజీహెచ్లో పరీక్షలు
మలికిపురం/ జీజీహెచ్ (కాకినాడ), మార్చి 14: ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న కోవిడ్-19 (కరోనా వైరస్) మండల కేంద్రమైన మలికిపురంలో శనివారం గల్ఫ్ దేశమైన ఖత్తార్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఉందేమోనన్న వార్త కలకలం రేపింది. వైద్యాధికారుల ఇంటింటా సర్వేలో ఆ వ్యక్తికి కొన్ని రోజులు నుంచి జలుబు, దగ్గు తగ్గకపోవడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు అతడితోపాటు ముగ్గురు కుటుంబ సభ్యులను శుక్రవారం అర్థరాత్రి పోలీస్ సెక్యూరిటీ, మెడికల్ సిబ్బంది, మోరి పీహెచ్సీ వైద్యులు కాకినాడ జీజీహెచ్కు తరలించారు.
అయితే వారికి వైరల్ ఫీవర్ అని, కరోనా లక్షణాలు లేవని తెలిసింది. ప్రస్తుతం వీరు కాకినాడలోనే ఉన్నారు. అలాగే రాజమహేంద్రవరానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఇటీవల యూకే నుంచి, రామచంద్రపురం మండలం శ్రీరాంపేటకు చెందిన 32ఏళ్ల వ్యక్తి మస్కట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. వీరితో పాటు మలికిపురం వ్యక్తిని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారులు శనివారం జీజీహెచ్లోని ప్రత్యేక కరోనా వైర్స వార్డుకు తరలించారు.
నోడల్ అధికారి, పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ముగ్గురికి గొంతు నుంచి శ్వాబ్ తీసి పరీక్ష నిమిత్తం విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాల ల్యాబ్కు పంపారు. రిపోర్టులు ఆదివారం సాయంత్రానికి రానున్నాయి.
అన్నవరంలో ముగ్గురి వివరాల సేకరణ
అన్నవరం: విదేశాల్లో ఉంటూ ఇటీవల స్వగ్రామమైన అన్నవరం వచ్చిన ముగ్గురి వివరాలను వేగంగా పంపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆదేశాలు రావడంతో శనివారం స్థానిక ఆరోగ్యసిబ్బంది డేటాను సేకరించారు. కువైట్ నుంచి శుక్రవారం వచ్చిన మహిళ, ఈనెల 9న కాలిఫోర్నియా నుంచి వచ్చిన ఓ మహిళ, 1న జపాన్ నుంచి వచ్చిన వ్యక్తికి సంబంధించిన డేటాను పంపించామని హెల్త్ సూపర్వైజర్ పీఎన్ఎ్సమూర్తి తెలిపారు.