దాచేపల్లి ఘటనలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-09-13T14:11:17+05:30 IST
క్వారీ వివాదంలో దాచేపల్లి మండలం నారాయణ పురంలో కత్తులతో కార్మికులపై..
జీజీహెచ్ వద్ద బంధువుల ఆందోళన
గుంటూరు(ఆంధ్రజ్యోతి): క్వారీ వివాదంలో దాచేపల్లి మండలం నారాయణ పురంలో కత్తులతో కార్మికులపై జరిగిన దాడిలో గాయపడి జీజీహెచ్లో చికిత్సపొందుతూ తమ్మిశెట్టి నీలకంఠబాబు (20) శనివారం మృతి చెందారు. ఈ ఘటనతో మృతుడి బంధువులు, అతని వర్గీయులు రాత్రి జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. దాచేపల్లి మండలం నారాయణపురంలో క్వారీలను నిర్వహిస్తున్న నరసరావుపేటకు చెందిన బండారు బయ్యన్నకు, కొందరు కార్మికులకు వివాదం నెలకొంది. దీనిపై ఇరువర్గాల మధ్య గురువారం జరిగిన పంచాయతీ సందర్భంగా బయ్యన్న వర్గీయులు మరోవర్గానికి చెందిన కార్మికులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడిన విష యం విదితమే. వారందరూ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారిలో నీలకంఠబాబు మృతి చెందాడు.
దీంతో ఆగ్రహించిన అతని కుటుంబ సభ్యులు, బంధువులు, వారి వర్గీయులు వడ్డెర సంఘం నాయకురాలు దేవళ్ళ రేవతి ఆధ్వర్యంలో జీజీహెచ్ ఎదుట మెయిన్రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు ట్రాఫిక్ను దారి మళ్ళిం చారు. కరోనా నేపథ్యంలో రోడ్డుపై ధర్నాలు, ఆందోళనలు చేయరాదని పోలీసులు ఎంత చెప్పి నా ఆందోళనకారులు వినిపించుకోకపోవడంతో ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య, కొత్తపేట సీఐ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బల వంతంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ అన్యాయంగా కార్మికులపై కత్తులతో దాడి చేసి ఒకరి హత్యకు కారణమైన బయ్యన్నతోపాటు దాడిలో పాల్గొన్న 20 మందిపై కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలన్నారు.
నారాయణపురం ఘటనలో గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని శని వారం రాత్రి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరా మర్శించారు. ఆసుపత్రికి వచ్చిన ఆయన సంబం ధిత వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.