కృష్ణా జలాలు ఇవ్వండి..!
ABN , First Publish Date - 2020-04-05T09:06:40+05:30 IST
ఎండలు మండిపోతున్నాయి. పెన్నానది భూగర్భజలాలు అడుగంటుతున్నాయి.
కడప నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి
వెలుగోడు, అలగనూరు నుంచి తాగునీరు
ఈ నెల 10 నుంచి రోజుకు 250-300 క్యూసెక్కులు విడుదల చేయాలి
కర్నూలు కలెక్టరుకు లేఖ రాసిన జిల్లా కలెక్టర్ హరికిరణ్
కడప, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎండలు మండిపోతున్నాయి. పెన్నానది భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో కడపలో తాగునీటి సమస్య తలెత్తకుండా జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ముందస్తు చర్యలకు ఉపక్రమించారు.
కడప నగరంలో 3.85 లక్షల జనాభా ఉంది. 48వేలకు పైగా గృహ వినియోగ నీటి కొళాయిలు, కమర్షియల్ టాప్ క నెక్షన్స్ 10వేలకు పైగా ఉన్నాయి. ప్రజలకు దాహం తీర్చేందుకు రోజుకు 50 మిలియన్ లీటర్లు (ఎంఎల్డీ) అవసరమని కార్పోరేషన్ ఎస్ఈ ఉమామహేశ్వర్రావు పేర్కొన్నారు. ప్రస్తుతం రామనపల్లె, బండి కనుమ, లింగంపల్లె దగ్గర పెన్నానదిలో ఏర్పాటు చేసిన గ్యాలరీ వెల్స్ నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. పెన్నా నదిలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో నగరంలో నీటి ఎద్దడి తీవ్రం కానుంది.
ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లా వెలుగోడు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి కృష్ణాజలాలు విడుదల చేయించాలని కార్పోరేషన్ కమిషనర్ లవన్న జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా ఈ నెల 10వతేదీ నుంచి పదిరోజుల పాటు రోజూ 300 క్యూసెక్కులు, ఆ తరువాత రోజుకు 250 క్యూసెక్కుల చొప్పున వర్షాలు వచ్చే వరకు అంటే జూలై ఆఖరు వరకు నీటిని విడుదల చేయాలని ఆ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జలవనరుల శాఖ (ప్రాజెక్ట్సు) సీఈ మురళీనాధ్రెడ్డిలకు కలెక్టర్ లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా 10వతేదీ నుంచి నీటి విడుదలకు కర్నూలు జలవనరుల శాఖ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా.. కర్నూలు జిల్లాలోని వెలుగోడు, అలగనూరు రిజర్వాయర్ల నుంచి కుందూనదికి నీటిని విడుదల చేస్తే ఆ నదిలో ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వరకు ప్రవహిస్తాయి. అక్కడి నుంచి పెన్నానది, కేసీ కాల్వకు మళ్లించి కడప నగరానికి తాగునీటిని తీసుకువచ్చే అవకాశం ఉంది.
అయితే నీటిని విడుదల చేసిన వెంటనే నేరుగా కడప నగరానికి చేరేవిధంగా కుందూలో ఓ పక్కన ప్రత్యేక తాత్కాలిక కాల్వను తవ్వి.. ఎగువన ఉన్న కర్నూలు జిల్లాలో నీటి చౌర్యం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే 250 క్యూసెక్కులు విడుదల చేసినా జిల్లాకు 20-30 క్యూసెక్కులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. దీనిపై ముందు నుంచే నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.