వ్యాట్ మోత.. ధరల వాత
ABN , First Publish Date - 2020-07-22T11:28:31+05:30 IST
పెట్రోలు, డీజలుపై కేంద్ర ప్రభుత్వం రోజుకు పైసల చొప్పున నెలకు పైగా పెంచుతూ వాహనదారులపై భారం మోపింది.
పెట్రోలు, డీజలుపై రాష్ట్ర సర్కారు వడ్డన
తగ్గించిన టీడీపీ పెంచేసిన వైసీపీ
జిల్లావాసులపై రోజుకు రూ.15 లక్షలు భారం
కడప (సిటి), జూలై 21: పెట్రోలు, డీజలుపై కేంద్ర ప్రభుత్వం రోజుకు పైసల చొప్పున నెలకు పైగా పెంచుతూ వాహనదారులపై భారం మోపింది. తానేమీ తక్కువ కాదంటూ కరోనా కష్టకాలంలోనూ తన ప్రత్యేకత చాటుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను ఆసరాగా చేసుకుని అదనం పేరుతో వడ్డన చేసింది. ఇప్పటికే పెరిగిన ధరలకు మరింత జోడిస్తూ పెట్రోలుపై లీటరుకు రూ.1.24, డీజలుపై 93 పైసలు పెంచింది. దీంతో గత నెల 6వ తేదీతో పోల్చితే ప్రస్తుతం లీటరు పెట్రోలుపై రూ.10.46, డీజలుపై రూ.12.44 పెరిగింది.
వ్యాట్ ఉన్నా వినియోగదారుల ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో గత టీడీపీ ప్రభుత్వం లీటరుపై రూ.2 తగ్గిస్తే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పెట్రోలు, డీజలుపై రూ.3.17 పెంచి ప్రత్యేకత చాటుకుంది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రో వినియోగం గణనీయంగా పడిపోయింది. వాస్తవంగా చమురు నిల్వలు పెరిగిపోవడంతో ధరలు తగ్గాలి. అందుకు విరుద్ధంగా దేశంలో గత నెల 7వ తేదీ నుంచి నెల రోజులుగా రోజుకు పైసల చొప్పున పెట్రోలు, డీజలు ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
అదనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వీర బాదుడు
పెట్రోలు, డీజలుపై రాష్ట్రంలో 31 శాతం వ్యాట్ కొనసాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అదనపు వ్యాట్ అంటూ లీటరు పెట్రోలుపై రూ.2.76, డీజలుపై రూ.3.07 వసూలు చేస్తోంది. తాజాగా రెండింటిపై లీటరుకు రూ.4 చేరుకునేలా లీటరు పెట్రోలుపై 1.24 పైసలు, డీజలుపై 93 పైసలు పెంచింది. వ్యాట్, అదనపు వ్యాట్ కలిపి వాహనదారుల పై ధరల పిడుగు పడేసింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో ఈనెల 20 వరకు ఉన్న పెట్రోలు లీటరు రూ.83.01 నుంచి రూ.84.25కు, డీజలు రూ.79.26 నుంచి రూ.80.19కి పెరిగింది.
జిల్లా వాసులపై రోజుకు రూ.15 లక్షలు భారం
జిల్లాలో 280 పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటి ద్వారా కరోనా లాక్డౌన్కు ముందు రోజుకు 15 లక్షల లీటర్ల డీజలు, 5 లక్షల లీటర్ల పెట్రోలు అమ్ముడయ్యేది. లాక్డౌన్ కారణంగా వాహనాలు రోడ్డెక్కలేదు. సడలింపుల అనంతరం ప్రస్తుతం రెండూ కలిపి 15 లక్షలకు మించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అదనపు వ్యాట్ కారణంగా జిల్లావాసులపై రోజుకు రూ.15 లక్షల భారం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఈ భారం మోయలేనిదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కష్టకాలంలో ప్రజల పరిస్థితులను గమనించి ధరలను తగ్గించాలని ప్రజలు, పలు పార్టీల నాయకులు కోరుతున్నారు.