‘అవగాహన లేకే.. మద్దతిచ్చాం’
ABN , First Publish Date - 2020-02-16T09:49:44+05:30 IST
అవగాహన లోపంతోనే నల్లచట్టాలకు మద్దతిచ్చామని, అలాంటి చట్టాలను..
అవగాహన లోపంతో ఆ చట్టాలకు మద్దతిచ్చాం
పదవులు కాదు.. ప్రజలే ముఖ్యం
నల్లచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
మిలీనియం లాంగ్మార్చ్లో డిప్యూటీ సీఎం అంజద్బాషా
కడప (చిన్నచౌకు): అవగాహన లోపంతోనే నల్లచట్టాలకు మద్దతిచ్చామని, అలాంటి చట్టాలను రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమని డిప్యూటీ సీఎం అంజద్బాష అన్నారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మిలినియం లాంగ్మార్చ్ శనివారం ఉదయం గౌస్నగర్ నుంచి బయలుదేరి పెద్ద దర్గా, అల్మా్సపేట, 1వ గాంధీబొమ్మ, గోకుల్సర్కిల్, ఏడు రోడ్ల మీదుగా కడప పాత కలెక్టరేట్ వద్ద ఉన్న షాహిన్బాగ్ ఎన్ఆర్సీ వ్యతిరేక జేఏసీ దీక్షల శిబిరం వద్దకు చేరుకుంది. అనంతరం డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ సీఏఏపై సరైన అవగాహన లేదని.. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకే సీఏఏ ప్రవేశపెడుతున్నామని కేంద్రప్రభుత్వం చెప్పడంతో మద్దతు ఇచ్చామన్నారు. తర్వాత ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లపై పరిశీలించామన్నారు.
ఈ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని గుర్తించామని, ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో అమలు చేయనివ్వమని చెప్పారు. ఎన్పీఆర్లో గత విధానాలు కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధానాలు కొత్తగా చేర్చారని తెలిపారు. ఇవన్నీ తెలుసుకునేందుకే సమయం పట్టిందన్నారు. ఇలాంటి విధానాలను సీఎం జగన్కు తెలిపి అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేయించి, రాష్ట్రంలో అమలుకాకుండా తీర్మానం చేస్తామన్నారు. ఎన్ఆర్సీ వ్యతిరేక జేఏసీ కన్వీనర్ సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అంజద్బాషా రాజీనామా చేయమని మేం కోరలేదని.. నల్లచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే చాలన్నారు. అలాగే పోరాటంలో అండగా నిలవాలని కోరామని తెలిపారు. మిలినియన్ లాంగ్మార్చ్లో ఎమ్మెల్యే రవిరెడ్డి, మాజీ మేయర్ సురేష్బాబు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామచంద్రయ్య, మత గురువులు వలీవుల్లాహుసేన్, ఫాస్టర్ మహ్మద్ఆలీ బగ్దాది, అక్బర్ ఆలీ రషాది, హబీబ్బుఖారి, సిరాజ్బుఖారి, సంఘ సేవకులు సలావుద్దీన్, వైసీపీ నాయకులు ఎస్బి అహ్మద్బాషా, మహ్మద్రఫి, షఫి, హబీబుల్లా, ఇలియాస్, పులి సునీల్, గౌస్, హఫీజ్, మున్నా, కమాల్బాషా తదితరులు పాల్గొన్నారు.