ఎన్నికల కమిషనర్ను దుర్భాషలాడడం తగదు
ABN , First Publish Date - 2020-03-19T10:29:53+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు ఎన్నికల కమిషనర్ను దుర్భాషలాడడం మంచి పద్ధతి కాదని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు.
వైసీపీ ఆగడాలపై బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు ధ్వజం
గుడివాడ రూరల్, మార్చి 18 : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు ఎన్నికల కమిషనర్ను దుర్భాషలాడడం మంచి పద్ధతి కాదని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. బుధవారం మోటూరులో నాగసాయి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పార్టీ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. అత్యధిక స్థానాలు గెలిస్తేనే మంత్రులుగా కొనసాగుతారని, మళ్లీ టిక్కెట్ పొందాలంటే ఎమ్మెల్యేలు ఏంచేసైనా ఎంపీటీసీ, జడ్పీ టీసీ, సర్పంచ్లను గెలిపించాలని జగన్ హుకుం జారీ చేయడంతో నామినేషన్ల ప్రక్రియలోనే వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో అభ్యర్థులను భయపెట్టి, కిడ్నాప్ కేసులకు లొంగకపోతే ప్రలోభాలకు గురిచేసి విత్ డ్రా చేయించి ఏకగ్రీవాలకు పాల్పడ్డారని ధ్వజ మెత్తారు. నామినేషన్ల స్ర్కూటినీ సందర్భంగా కూడా వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడ్డారన్నారు. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.
దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, గుత్తికొండ శ్రీరాజబాబు, నియోజకవర్గ ఇన్చార్జి సూరే గాంధీ, ఆలమూరి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.