ఆ హామీ ఏమైంది?
ABN , First Publish Date - 2020-12-12T05:02:55+05:30 IST
రియల్టర్లకు రైతులు, ప్రజల కష్టాలు తెలియవని, వారు రాజకీయాలకు పనికిరారని నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్రెడ్డి అన్నారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్రెడ్డి
బండి ఆత్మకూరు, డిసెంబరు 11: రియల్టర్లకు రైతులు, ప్రజల కష్టాలు తెలియవని, వారు రాజకీయాలకు పనికిరారని నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం బండిఆత్మకూరు మండలంలోని సంతజూటూరు గ్రామంలో తెలుగుగంగ కింద రబీ సీజన్కు రైతులకు సాగు నీరు అందించాలన్న డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. బుడ్డా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్లో అధిక వర్షాలు, తుఫాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అయితే రబీకి నీరిచ్చి అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే, శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా అధికారులు నీరు ఇవ్వలేమని చెప్పడం బాధాకరమన్నారు. అవసమైతే మూడు పంటలకు నీరు ఇస్తామని చెప్పుకున్న ఎమ్మెల్యే, ఇప్పుడెందుకు రెండో పంటకు నీరు ఇవ్వటానికి వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. ఇందులో ఆయనకు రూ.7 కోట్ల కమీషన్ మతలబు దాగి ఉందని, ఈ విషయం రైతులు బాగా అర్థం చేసుకోవాలని అన్నారు. నీరు విడుదలయ్యేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే నిరాహారదీక్షకు దిగతామని అని బుడ్డా హెచ్చరించారు. బీజేపీ నాయకులు బోరెడ్డి అక్ష్మరెడ్డి, హర్షవర్ధన్, శ్రీనివాసులు, రమేష్ యాదవ్, స్వాతి, వాణి, గంగాధర్, రాజశేఖర్రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ఇన్చార్జి డీఎస్పీ మహబూబ్బాషా, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ రమాంజనేయులు నాయక్ ఆధ్వర్యంలో సుమారు 40 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టారు.