ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2020-12-11T05:20:12+05:30 IST
‘పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధి చెందాలి’ అని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పిలుపునిచ్చారు. పలాస మండలం కైజోల గ్రామంలో గురువారం ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని ఆయన ప్రారంభించారు.
స్పీకర్ తమ్మినేని సీతారామ్
కైజోల (పలాస రూరల్), డిసెంబరు 10: ‘పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధి చెందాలి’ అని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పిలుపునిచ్చారు. పలాస మండలం కైజోల గ్రామంలో గురువారం ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ చేయూత’ కింద జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా గొర్రెలు-మేకల యూనిట్లను పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. మహిళలకు మెరుగైన జీవనోపాధి.. సుస్థిర ఆదాయమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జిల్లాలో 1000 యూనిట్ల పంపిణీకి గాను 702 యూనిట్ల బ్యాంకు లింకేజీ అందించామన్నారు. పంపిణీలో భాగంగా ఒక్కో యూనిట్కు 14గొర్రెలు, ఒకమేక చొప్పున లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ నివాస్, జేసీ సుమిత్కుమార్, సబ్కలెక్టర్ సూరజ్ ధనుంజయ, పశుసంవర్ధక శాఖ జేడీ ఎ.ఈశ్వరరావు, ఉపసంచాలకులు జయరాజ్, సహాయ సంచాలకులు చంద్రశేఖర్, తహసీల్దార్ మధుసూదనరావు, వైసీపీ శ్రేణులు కిల్లి కృపారాణి, సాయిరాజ్, దువ్వాడ శ్రీనివాస్, పేడాడ తిలక్, సీదిరి శ్రీదేవి పాల్గొన్నారు.