యూరియా కోసం నిరీక్షణ
ABN , First Publish Date - 2020-09-06T10:41:59+05:30 IST
యూరియా కోసం నిరీక్షణ
సుసరాం(పోలాకి), సెప్టెంబరు 5: ఖరీఫ్ సీజన్లో రైతులు యూరియా ఎరువు కోసం ఎండలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. శనివారం సుసరాం పంచాయతీ కార్యాలయం వద్ద యూరియా వస్తుందని రైతులు పట్టాదార్ పాసుపుస్తకం, ఆధార్కార్డుతో హాజరుకావాలని రైతుబరోసా కేంద్రం ప్రతినిధులు దండోరా వేయడంతో రైతులు తరలివచ్చారు. సిబ్బంది పేర్లు నమోదు చేసుకుని చీటిలు ఇచ్చారు. అయితే ఉదయం 8 నుంచి వచ్చిన రైతులు మధ్యాహ్నం 12 గంటలైనా ఎరువుల లోడు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై ఆర్బీకే ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎరువు ప్రత్యేక వాహనంలో తీసుకువస్తున్నామని, దారి మధ్యలో ఉందని త్వరలో రైతులందరికీ పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులంతా యూరియా కావాలని కోరడంతో డిమాండ్ ఏర్పడిందని ఏవో వెంకటరావు తెలిపారు.