జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి
ABN , First Publish Date - 2020-12-25T06:04:05+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.
ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్
పాడేరు, డిసెంబరు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ కార్యక్రమానికి కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం నిధులను విడుదల చేసిందన్నారు. తొలివిడతగా 1,565 గిరిజన గ్రామాల్లో రూ.46.02 కోట్లతో ఇంటింటికి తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం గ్రామాల్లో నీరు, పారిశుధ్యం కమిటీలను ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలోనే నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. జల జీవన్ మిషన్ నిధులు ఈనెల 28వ తేదీలోగా ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్చంద్ వీడియో కాన్ఫెరెన్స్లో ఆదేశించారన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ డీఈఈలు, ఏఈఈలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కె.రామస్వామి, డీఎల్పీవో పీఎస్.కుమార్, 11 మండలాల డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.