నాడు - నేడు పనుల మార్గదర్శకాలు విడుదల
ABN , First Publish Date - 2020-03-15T11:43:12+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా అభివృద్ధి చేసేందుకు మూడు విడతల్లో చేపట్టిన
ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 14 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా అభివృద్ధి చేసేందుకు మూడు విడతల్లో చేపట్టిన మనబడి నాడు - నేడు పథకం అమలుకు మార్గదర్శకాలను శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమం అమలులో ప్రధానో పాధ్యాయులు, సీఆర్పీలు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ స్పష్టతతో కూడిన ఆదేశాలు ఇచ్చారు. నాడు - నేడు పథకంలో చేపట్టే పనులన్నింటిని తల్లిదండ్రుల కమిటీల సహాయంతో చేపట్టాలని, మేస్ర్తిలకు వారు చేసిన పని ఆధారంగా నేరుగా చెల్లింపులు చేయాలని సూచించారు. ఈ మేరకు పేరేంట్స్ కమిటీ బ్యాంకు ఖాతాలకు రివాల్వింగ్ ఫండ్ నిధులను ఇప్పటికే ప్రభుత్వం జమ చేసినట్టు పేర్కొన్నారు.
కూలీలు, మేస్ర్తీలు, వాచ్మెన్ల నెలవారీ జీతం చెల్లింపులు, సామగ్రి కొనుగోలుకు, కమిటీ సభ్యుల రోజువారీ ఖర్చులకు మాత్రమే రివాల్వింగ్ ఫండ్ను వినియోగించాలని స్పష్టత ఇచ్చారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి తీర్మానం కాపీని స్కూలు హెచ్ఎం లాగిన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మంచి నైపుణ్యం కలిగిన మేస్ర్తీలతో తగిన ఒప్పందం చేసుకోవాలని ఆ మేరకు చదరపు అడుగుకు చేయాల్సిన పనులను పొందు పరచాలని సూచించారు. ముందస్తుగా ఎటువంటి చెల్లింపులు చేయరాదని కోరారు.
పేరెంట్స్ కమిటీ ద్వారా సిమెంట్, స్టీలు, కంకర, ఇటుక, ఫ్లోరింగ్, గోడలకు టైల్స్, గ్రానైట్ శ్లాబ్లు, శానిటరీ పైప్లు వంటివి కొనుగోలు చేయవచ్చని, రాష్ట్రస్థాయి టెండర్ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యా యులకు అవసరమైన బల్లలు, కుర్చీలు, పాఠశాలలకు అల్మారాలు, ఫ్యాన్లు, వాష్ బేషిన్లు, ఆకుపచ్చబోర్డులు, పెయింట్లు, వంటివి కొనుగోలు చేసి సరఫరా చేస్తారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.