శాటిలైట్ విధానంలో వెబ్లాండ్ సర్వే
ABN , First Publish Date - 2020-09-29T08:59:37+05:30 IST
శాటిలైట్ విధానం ద్వారా భూములను సర్వే చేస్తున్నట్టు సర్వే శాఖ రాష్ట్ర కమిషనర్, సర్వే ఇనిస్టిట్యూట్ వైస్ ప్రిన్సిపల్ వీఎస్ఎన్ కుమార్ పేర్కొన్నారు.
సర్వేశాఖ రాష్ట్ర కమిషనర్ కుమార్
తాడేపల్లిగూడెం రూరల్, సెప్టెంబర్ 28 : శాటిలైట్ విధానం ద్వారా భూములను సర్వే చేస్తున్నట్టు సర్వే శాఖ రాష్ట్ర కమిషనర్, సర్వే ఇనిస్టిట్యూట్ వైస్ ప్రిన్సిపల్ వీఎస్ఎన్ కుమార్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని శశి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గ్రామ సర్వే అసిస్టెంట్లకు ఇస్తున్న శిక్షణను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.
‘గ్రామ సచివాలయాల్లో 11 వేల 150 మంది సర్వే అసిస్టెంట్లను ప్రభుత్వం తీసుకుంది. నూతన సర్వే విధానంపై వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2.44 కోట్లు ఖర్చు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎలాంటి కొలతలు కావాలన్నా వారి ద్వారా చేయించనుంది. దీనికి మీ సేవలో ఛలానా కట్టిన 10 రోజుల్లోనే వారికి సేవలు అందుతాయి.
ఈ ప్రక్రియ జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది’ అని వివరించారు. శాటిలైట్ సర్వే పద్ధతిని అసిస్టెంట్లకు వివరించారు. సర్వేయర్లు రౌతు రామకృష్ణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.