ఏడో తరగతి పాఠ్యపుస్తకాల నుంచి ఆ పాఠం తొలగింపు
ABN , First Publish Date - 2020-07-29T00:37:12+05:30 IST
ఏడో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ గురించిన పాఠాన్ని తొలగిస్తూ..
బెంగళూరు: ఏడో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ పాఠాన్ని తొలగిస్తూ కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఈ విద్యాసంవత్సరం ఆలస్యం కానున్న నేపథ్యంలో సిలబస్ భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ‘‘కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ఆలస్యంగా స్కూళ్లు తెరుస్తున్నందున సిలబస్ను 30 శాతానికి పైగా తగ్గిస్తున్నాం. ఇందులో భాగంగా ఏడోతరగతి చరిత్ర పుస్తకాల్లో టిప్పు సుల్తాన్ పాఠాన్ని కూడా పక్కనబెట్టడం జరిగింది..’’ అని కర్నాటక టెక్ట్స్బుక్ సొసైటీ డైరెక్టర్ మద్దె గౌడ పేర్కొన్నారు. కాగా ఆరో తరగతి, పదో తరగతి పుస్తకాల్లో మాత్రం ఈ ‘మైసూరు టైగర్’ పాఠాన్ని యధాతథంగా ఉంచడం గమనార్హం. ‘‘7వ తరగతి పిల్లలు అప్పటికే ఆరో తరగతిలో టిప్పు గురించి చదివే ఉంటారు. ఆయన గురించి మరింత సమాచారం పదో తరగతి పుస్తకాల్లో చదువుకోవచ్చు. కాబట్టి సిలబస్ తగ్గింపులో ఈ పాఠాన్ని తొలగించడం వల్ల విద్యార్ధులు నష్టపోయేదేమీ ఉండదు..’’ అని సొసైటీ పేర్కొంది.