ఎట్టకేలకు చిక్కిన చిరుత
ABN , First Publish Date - 2020-03-19T14:04:08+05:30 IST
ఎట్టకేలకు చిక్కిన చిరుత
కర్ణాటక, తుమకూరు: జిల్లా ప్రజలను బెంబేలెత్తించిన మ్యాన్ఈటర్ చిరుత పట్టుబడింది. 25మంది అటవీసిబ్బంది కార్యాచరణలో పాల్గొన్నారు. తాలూకాలోని కసబా హోబళి ఆలనూరు గ్రామ ఆచారపాళ్య రోడ్డు హేమావతి చానెల్ టన్నెల్ వద్ద చిక్కిందని అటవీశాఖ ఉపసంరక్షణాధికారి గిరీశ్ తెలిపారు. డా.సన్నత్ నేతృత్వంలో ట్రాంక్విలైజర్స్ సాయంతో సురక్షితంగా పట్టుకున్నామన్నారు. కాగా మంగళవారం కూడా బుక్కపట్టణ పరిధిలోని జానకల్ గ్రామం వద్ద ఒక చిరుతను బంధించామన్నారు. కాగా సమీప ప్రాంతాలలో మరిన్ని చిరుతలు సంచరిస్తున్నాయన్న అనుమానం ఉందని వాటిని కూడా అదుపులోకి తీసుకోదలిచామన్నారు. ఏది ఏమైనా గ్రామ శివార్లలో వన్యప్రాణుల సంచారానికి అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యేకించి గొర్రెల కాపరులు మరింత జాగరూకత వహించాలన్నారు. ఇలా బంధించిన రెండు చిరుతలను రక్షిత అటవీప్రాంతానికి తరలించనున్నట్టు పేర్కొన్నారు. కార్యాచరణలో స్థానిక పోలీసులు, గ్రామస్తులు సహకారం అందించారన్నారు.