కరోనా పాజిటివ్ పరార్
ABN , First Publish Date - 2020-03-15T07:56:22+05:30 IST
అతడు బెంగళూరులోని గూగుల్లో ఉద్యోగి. గత నెల్లోనే అతనికి వివాహమైంది.
- బెంగళూరులో క్వారంటైన్ నుంచి పారిపోయిన భార్య
ఆగ్రా, మార్చి 14 : అతడు బెంగళూరులోని గూగుల్లో ఉద్యోగి. గత నెల్లోనే అతనికి వివాహమైంది. హనీమూన్ కోసం కొత్త జంట అదే నెలలో యూరో పకు వెళ్లింది. ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించి మాసం చివరలో వారిద్దరూ బెంగళూరుకు తిరిగివచ్చారు. అయితే కరోనా అనుమానంతో ఈనెల 7న ఓ ఆస్పత్రిలో భర్త పరీక్ష చేయించుకోగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడిని క్వారంటైన్లో ఉంచారు. అతడి భార్యను కూడా పరీక్షించగా ఆమెకూ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆమెను కూడా క్వారంటైన్లో ఉంచారు. భయపడి ఆమె ఈనెల 8న ఆస్పత్రి నుంచి పరారైంది. నగరంలో విమానం ఎక్కి ఢిల్లీ వరకు ప్రయాణించింది. అక్కడి నుంచి ఆగ్రా వరకు రైల్లో ఉత్తరప్రదేశ్లోని తన సొంతూరు వెళ్లింది. ఈ విషయం ఆగ్రా ఆరోగ్యాధికారులకు తెలియడంతో వారు ఆమె ఇంటికి వెళ్లారు. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచడానికి ప్రయత్నించగా వారు ప్రతిఘటించారు. దీంతో జిల్లా కలెక్టరు జోక్యం చేసుకొని పోలీసుల సాయంతో మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచగలిగారు. ఉద్యోగి భార్యను ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలోని ఓ ఏకాంత వార్డుకు తరలించారు.