ఐదుగురు లోక్సభ సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-13T22:11:17+05:30 IST
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సకల జాగ్రత్తలతో
న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సకల జాగ్రత్తలతో ఈ సమావేశాలను నిర్వహించబోతున్నారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులకు కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయితేనే ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇస్తున్నారు.
ఇదిలావుండగా, ఐదుగురు లోక్సభ సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. మంత్రులకు కోవిడ్-19 పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి 72 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఉభయ సభల సభ్యులను కోరారు. ప్రభుత్వ అనుమతి పొందిన ఏదైనా ఆసుపత్రి/ల్యాబొరేటరీలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు అఖిల పక్ష సమావేశం నిర్వహించడం సంప్రదాయం. కానీ ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా దీనిని రద్దు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించవలసిన అంశాలను, లక్ష్యాలను నిర్ణయించడానికి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. లోక్సభ సభాపతి, రాజ్యసభ చైర్మన్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంటు సమావేశాల నిర్వహణలో చాలా మార్పులు చేశారు. రోజుకు 4 గంటలపాటు సమావేశాలు జరుగుతాయి. జీరో అవర్ సమయాన్ని అర గంటకు కుదించారు. ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. సభ్యులు కూర్చునేటపుడు భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు.