జన్ ధన్ ఖాతాల వదంతులపై కేంద్రం క్లారిటీ
ABN , First Publish Date - 2020-04-15T12:48:55+05:30 IST
మహిళల జన్ ధన్ ఖాతాలకు సంబంధించిన వదంతులను ఖండిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.... ఈ ఖాతాలకు పంపిన డబ్బు పూర్తిగా...
న్యూఢిల్లీ: మహిళల జన్ ధన్ ఖాతాలకు సంబంధించిన వదంతులను ఖండిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.... ఈ ఖాతాలకు పంపిన డబ్బు పూర్తిగా సురక్షితం అని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ డబ్బును ఉపసంహరించుకోదని, మహిళా ఖాతాదారులు తమ అవసరాలకు అనుగుణంగా దాన్ని ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. కాగా ఖాతాల నుండి డబ్బును వెంటనే ఉపసంహరించుకోకపోతే, ప్రభుత్వం దానిని తీసుకుంటుందని ఒక వదంతి వ్యాపిస్తోంది. దీనితో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బును ఉపసంహరించుకోవడానికి బ్యాంకులు, ఎటిఎంల ముందు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సేవల కార్యదర్శి ఇటువంటి వదంతులను ఖండించారు. జన ధన్ ఖాతాల్లో జమ చేసిన మొత్తం పూర్తిగా సురక్షితం అని హామీ ఇస్తున్నామని ఆయన ఒక ట్వీట్లో పేర్కొన్నారు. కాగా వచ్చే మూడు నెలలలోను 20.5 కోట్ల మంది మహిళా జన్ ధన్ ఖాతాదారుల ఖాతాకు నెలకు రూ .500 పంపనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గత నెలలో ప్రకటించారు.