కేంద్రానికి మరో రైతు సంఘం మద్దతు.. ఒత్తిడికి లొంగవద్దంటూ లేఖ!

ABN , First Publish Date - 2020-12-25T04:03:07+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు కిసాన్ మజ్దూర్ సంఘ్ సభ్యులు మద్దతు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనకు కేంద్రం..

కేంద్రానికి మరో రైతు సంఘం మద్దతు.. ఒత్తిడికి లొంగవద్దంటూ లేఖ!

న్యూఢిల్లీ: యూపీకి చెందిన కిసాన్ మజ్దూర్ సంఘ్ సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనకు కేంద్రం తలొగ్గరాదంటూ వినతి పత్రం అందజేశారు. ఇవాళ కిసాన్ మజ్దూర్ సంఘ్‌కి చెందిన దాదాపు 60 మంది రైతులు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తోమర్ స్పందిస్తూ.. నూతన వ్యవసాయ చట్టాలకు ఎలాంటి సవరణలు చేయరాదని సదరు రైతు సంఘం కోరినట్టు వెల్లడించారు. ‘‘కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా బాఘ్పత్‌కి చెందిన రైతులు లేఖ అందజేశారు. కేంద్రం ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గరాదనీ.. వ్యవసాయ చట్టాలకు సవరణ చేయరాదని వారు కోరారు..’’ అని తోమర్ తెలిపారు.


కాగా ఇటీవల యూపీ, కేరళ, తమిళనాడు, బీహార్, హర్యానాకి చెందిన దాదాపు 10 రైతు సంఘాలు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాల కారణంగా కనీస మద్దతు ధర, మండీల వ్యవస్థ రద్దయిపోతుందంటూ వివిధ రైతు సంఘాలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. కేంద్రం తీసుకొచ్చే ఎలాంటి సవరణనూ తాము అంగీకరించబోమనీ.. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Updated Date - 2020-12-25T04:03:07+05:30 IST