ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఆ డ్రెస్ వేసుకోవద్దు.. ‘మహా’ సర్కార్ హుకుం!

ABN , First Publish Date - 2020-12-12T01:23:14+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన నిబంధన ప్రకారం మహారాష్ట్ర...

ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఆ డ్రెస్ వేసుకోవద్దు.. ‘మహా’ సర్కార్ హుకుం!

ముంబై: ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన నిబంధనల ప్రకారం మహారాష్ట్ర  ఉద్యోగులు సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయల్లో టీ-షర్టులు, జీన్స్ ధరించడం నిషేధం. విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగుల వస్త్రధారణ ‘‘సరైన’’ పద్ధతిలో ఉండాలని  ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఆదేశించింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్‌లలో జీన్స్, టీషర్టులు ధరించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రొఫెషనల్‌ స్థాయిలో తగిన ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించాలని సూచించింది...’’ అంటూ ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. 


గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదంటూ ఇదే తరహాలో ఆదేశాలు వెలువడ్డాయి. కొన్ని చోట్ల స్కర్టులు ధరించరాదని కూడా ప్రభుత్వాలు ఆదేశించాయి. గతేడాది బీహార్‌ ప్రభుత్వం కూడా ఉద్యోగులు క్యాజువల్ దుస్తులు ధరించడాన్ని నిషేధించింది. ‘‘కార్యాలయ సంస్కృతికి, ఆఫీసు మర్యాదకు’’ అవి విరుద్ధమంటూ ప్రభుత్వం పేర్కొంది. 2018 జూన్‌లో రాజస్థాన్ ప్రభుత్వం తమ ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించరాదంటూ హుకుం జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం కూడా ఉద్యోగులు తమిళ, భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింభించే దుస్తులే ధరించాలని ఆదేశించింది. 2018లో కర్నాటక ప్రభుత్వం కూడా మహిళా ఉద్యోగులు స్కర్టులు, టీషర్టులు, ప్యాంటు ధరించరాదనీ.. పురుష ఉద్యోగులు టీషర్టులు ధరించకూడదని ఆదేశించింది. 

Updated Date - 2020-12-12T01:23:14+05:30 IST