అర్ణబ్‌ గోస్వామి వ్యవహారంలో కోర్టు నోటీసులకు స్పందించం!

ABN , First Publish Date - 2020-12-17T07:54:38+05:30 IST

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌-వ్యాఖ్యాత అర్ణబ్‌ గోస్వామి వ్యవహారం.. ప్రజాస్వామ్య మూలస్తంభాలైన చట్టసభలు, న్యాయవ్యవస్థ మధ్య అధికార విభజనపై చర్చకు దారితీస్తోంది.

అర్ణబ్‌ గోస్వామి వ్యవహారంలో కోర్టు నోటీసులకు స్పందించం!

మహారాష్ట్ర అసెంబ్లీ, మండలి తీర్మానం

ముంబై, డిసెంబరు 16: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌-వ్యాఖ్యాత అర్ణబ్‌ గోస్వామి వ్యవహారం.. ప్రజాస్వామ్య మూలస్తంభాలైన చట్టసభలు, న్యాయవ్యవస్థ మధ్య అధికార విభజనపై చర్చకు దారితీస్తోంది. ఆయనపై  కొందరు పాలక పక్ష సభ్యులు ప్రవేశపెట్టిన సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాలకు సంబంధించి.. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జారీచేసే నోటీసులకు స్పందించరాదని రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి తీర్మానించాయి. అలా స్పందిస్తే.. చట్టసభలపై న్యాయవ్యవస్థ నియంత్రణాధికారాన్ని అంగీకరించడమే అవుతుందని, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికే విరుద్ధమని మంగళవారం పేర్కొన్నాయి (అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమ, మంగళవారాల్లో జరిగాయి).


‘ప్రభుత్వంలోని మూడు విభాగాలైన న్యాయవ్యవస్థ, శాసనసభ/పార్లమెంటు, కార్యనిర్వాహక శాఖల హద్దులను రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించింది. వాటిని ఆయా విభాగాలూ పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరి అధికార పరిధిలోకి మరొకరు చొరబడకూడదు’ అని అసెంబ్లీ స్పీకర్‌ నానా పటోలే పేర్కొన్నారు.


‘శాసనసభ, అసెంబ్లీ సచివాలయం, దాని కార్యదర్శులు, ఇతర అధికారులు కోర్టు నోటీసులకు, ఇతరత్రా ఉత్తర ప్రత్యత్తరాలకు సమాధానమివ్వడమంటే.. ఒకరకంగా చట్టసభలను న్యాయవ్యవస్థ నియంత్రించవచ్చని అంగీకరించడమే అవుతుంది. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి తగినట్లుగా లేదు’ అని మండలి చైర్మన్‌ రామ్‌రాజే నింబాల్కర్‌ తెలిపారు.  


చార్జిషీటుపై సవాల్‌కు అర్ణబ్‌కు అనుమతి

2018లో ఇంటీరియర్‌ డిజైనర్‌ అన్వయ్‌ నాయక్‌, ఆయన తల్లి కుముద్‌ ఆత్మహత్యకు అర్ణబ్‌ ప్రేరేపించారన్న కేసులో.. ఆయన సహా ముగ్గురిపై దాఖలుచేసిన చార్జిషీటును రాయ్‌గఢ్‌ కోర్టు పరిగణనలోకి తీసుకోగా.. దీనిని పై కోర్టులో సవాల్‌ చేసేందుకు బోంబే హైకోర్టు అర్ణబ్‌కు బుధవారమే అనుమతిచ్చింది. తదుపరి విచారణను జనవరి 6కి వాయిదావేసింది.


Updated Date - 2020-12-17T07:54:38+05:30 IST