కరోనా కబుర్లలో పైలట్, కో-పైలట్
ABN , First Publish Date - 2020-06-25T07:17:24+05:30 IST
పైలట్, కో-పైలట్ కరోనా మహమ్మారి గురించి చర్చించుకుంటున్నారు. ఆ కబుర్లలో పడి ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలూ పట్టించుకోలేదు. విమాన గమనంపైనా దృష్టి పెట్టలేదు...
- కంట్రోలర్ నిబంధనలు పాటించలేదు
- పాక్లో విమాన ప్రమాదంపై మంత్రి
ఇస్లామాబాద్, జూన్ 24: పైలట్, కో-పైలట్ కరోనా మహమ్మారి గురించి చర్చించుకుంటున్నారు. ఆ కబుర్లలో పడి ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలూ పట్టించుకోలేదు. విమాన గమనంపైనా దృష్టి పెట్టలేదు. విమానాశ్రయం సమీపించినా విమానాన్ని కిందికి దించలేదు. చివరి నిమిషంలో తేరుకొని విమానాన్ని ఒక్కసారిగా దించేశారు. ఈ కంగారులో ఎయిర్పోర్టు సమీపంలోని బహుళ అంతస్తుల ఇళ్లను విమానం ఢీకొట్టడం.. రెండు ఇంజన్లు విఫలమవడం.. పైలట్లతో సహా 97మంది అగ్నికి ఆహుతి అవడం.. వెనువెంటనే జరిగిపోయాయి. ఈ ఘటన గత నెల 22వ తేదీన పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంపై జరిపిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను పాక్ పార్లమెంటులో ఆ దేశ పౌర విమానయాన శాఖ మంత్రి గులాం సర్వర్ ఖాన్ బుధవారం ప్రవేశపెట్టారు. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, ప్రయాణానికి 100శాతం అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమన్నారు.