నితీశ్కు షాక్... ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్
ABN , First Publish Date - 2020-12-25T20:29:25+05:30 IST
అయితే ఈ ఆరుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలను నెలకిందే జేడీయూ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ
న్యూఢిల్లీ : జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు అరుణాచల్ ప్రదేశ్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్లో జేడీయూకు ఏడుగురు ఎమ్మెల్యేలుండగా.... ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం జేడీయూకు ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. అయితే ఈ ఆరుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలను నెలకిందే జేడీయూ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నోటీసులు కూడా జారీ చేసింది. హాంగ్ మాంగ్ఫీ, జిక్కే టాకో, డోంగ్రూ స్యోంగ్జూ, తలేమ్ తాహోబ్, కన్గ్గోంగ తాకు, డోర్జీ వాంగ్ఢీ ఖర్మ అనే ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యారు. అయితే ఈ వ్యవహారంపై అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు బియురాం వాంఘే మాట్లాడుతూ... ‘‘ప్రజలు అభివృద్ధివైపు నిలిచారు. ముఖ్యమంత్రి పెమాఖండు, ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంచారు.’’ అని వాంఘే పేర్కొన్నారు.
అయినా మేం బీజేపీ వెంటే : జేడీయూ
ఈ ఘటనతో తాము ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయామని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ అన్నారు. అయినా సరే... తాము బీజేపీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా దక్కినా, తాము స్నేహపూర్వక ప్రతిపక్షం గానే కొనసాగుతామని కేసీ త్యాగీ తెలిపారు.