పార్కు స్థలంలో రోడ్డు
ABN , First Publish Date - 2020-05-09T10:36:46+05:30 IST
జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్ హుడా లే అవుట్లో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను నిలిపివేయాలని హైకోర్టు
నిలిపివేయాలన్న హైకోర్టు
అసోసియేషన్ ప్రతినిధుల రిట్ పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం
హైదరాబాద్ సిటీ, మే 8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్ హుడా లే అవుట్లో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని నందగిరి హిల్స్ హుడా లే అవుట్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధులు ప్రసాద్ కందిమల్ల, ఫణి కొండపూడి తెలిపారు. అసోసియేషన్ తరపున దాఖలు చేసినపిటిషన్పై స్పందించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు కొనసాగించవద్దని పేర్కొందని చెప్పారు.
నందగిరిహిల్స్లోని హుడా లే అవుట్ నుంచి విస్పర్ వ్యాలీ వరకు హైదరాబాద్ రోడ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) రోడ్డు నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించిందని పిటిషన్లో పేర్కొన్నారు. హుడా లే అవుట్లోని ఖాళీ స్థలంలో (పార్కు ఏరియా) చెట్లు, రాళ్లను తొలగిస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాత్రి వేళ బ్లాస్టింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయా అంశాలను ప్రస్తావిస్తూ అసోసియేషన్ తరపున హైకోర్టులో రిట్ పిటిషన్(6744 ఆఫ్ 2020) దాఖలు చేశారు.
హుడా లే అవుట్లోని ప్లాట్ నంబర్లు 19 నుంచి 26 వరకు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రోడ్డు నిర్మిస్తున్నారని, ఇందుకోసం 300 చెట్లు తొలగించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు... తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెట్లు తొలగించవద్దని, రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని శుక్రవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొందని వారు చెప్పారు. మాస్టర్ప్లాన్లో మార్పులు చేయకుండా పార్కు స్థలంలో రోడ్డు ఎలా వేస్తారని కోర్టు అభిప్రాయపడిందని చెప్పారు.