పేదలకు, కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
ABN , First Publish Date - 2020-04-14T12:41:56+05:30 IST
లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులు, పేదలకు జిల్లా వ్యాప్తంగా పలువురు సాయం అందిస్తున్నారు.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 13: లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులు, పేదలకు జిల్లా వ్యాప్తంగా పలువురు సాయం అందిస్తున్నారు. సోమవారం నగరంలోని పలు డివిజన్లలో కార్పొరేటర్లతో కలిసి నగర మేయర్ యాదగిరి సునీల్రావు పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. 53వ డివిజన్లో కార్పొరేటర్ తుల శ్రీదేవి చంద్రమౌళితో కలిసి పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
25వ డివిజన్లో కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్తో కలిసి పేదలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో డివిజన్ మున్సిపల్ కార్మికులకు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణిహరిశంకర్ ప్రారంభించారు. బస్టాండ్, బోయవాడలో మాజీమేయర్ సర్దార్ రవీందర్సింగ్, కార్పొరేటర్ కమల్జిత్కౌర్తో కలిసి కార్మికులకు చికెన్, కోడిగుడ్లు, ఇతర నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. 44వ డివిజన్లో కార్పొరేటర్ మెండి శ్రీలతచంద్రశేఖర్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సీపీఐ నాయకులు మున్సిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఆర్ఎస్సెస్ కరీంనగర్ విద్యానగర్ శాఖ ఆధ్వర్యంలో రేకుర్తి 17, 18డివిజన్లలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కార్మికులకు తెలంగాణ ప్రాంత గ్రామవికాస్ ప్రముఖ్ జిన్న సత్యనారాయణ, కొత్తపల్లి ఖండ కార్యవాహ గోల్లె తిరుపతి, స్వయం సేవకులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. జిల్లా ఆర్కెస్ట్రా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 112మంది కళాకారులకు జేసీ శ్యాంప్రసాద్లాల్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం రెండవందల మందికి పులోహోర పాకెట్లు, వాటర్ బాటిల్స్, శానిటైజర్లను పంపిణీ చేశారు.