బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించి.. లాకర్ డోరు తెరుచుకోకపోవడంతో..
ABN , First Publish Date - 2020-07-15T18:20:29+05:30 IST
మండల కేంద్రమైన పాపన్నపేటలో డీసీసీబీ బ్యాంకులో..
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటలో డీసీసీబీ బ్యాంకులో దోపిడీకి దొంగలు ప్రయత్నించారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... పాపన్నపేటలో ఉన్న సహకార బ్యాంకులో సోమవారం రాత్రి రంధ్రం వేసి లోపలికి దొంగలు చొరబడ్డారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కనెక్షన్ వైర్లను కత్తించారు. బ్యాంకులో లాకర్ పగులగొట్టడానికి ప్రయత్నం చేయగా.. లాకర్ డోరు తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. సీసీ కెమెరాలకు సంబంధించిన సామగ్రిని మొత్తం ఎత్తుకెళ్లారు.
మంగళవారం ఉదయం విధులకు వచ్చిన ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ చేరుకొని క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ను రప్పించి విచారణ ప్రారంభించారు. లాకర్లో సొమ్ము పోలేదని తెలుసుకున్న ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు నెలల క్రితం టేక్మాల్ మండలంలో కూడా ఇదే తరహాలో దొంగలు బ్యాంకును దోపిడీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే.