దేశం చూపు దుబ్బాక వైపు
ABN , First Publish Date - 2020-10-12T10:47:06+05:30 IST
దేశం మొత్తం దుబ్బాక వైపు చూస్తున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సుజాతమ్మ గెలుపు దేశంలో అనేక మలుపులకు దారితీస్తుందని తెలిపారు
సమాఖ్య స్ఫూర్తిని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ
గుంటకాడి నక్కలా కాచుకున్న కాంగ్రెస్
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక, అక్టోబరు 11 : దేశం మొత్తం దుబ్బాక వైపు చూస్తున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సుజాతమ్మ గెలుపు దేశంలో అనేక మలుపులకు దారితీస్తుందని తెలిపారు. ఆదివారం దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డితో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతారామలింగారెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దూరదృష్టి, దార్శనికత గల నాయకుడన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో వచ్చిన ఉపఎన్నికల్లో ఎక్కడా ఓట్లు చిట్లిపోకుండా టీఆర్ఎ్సకు వేయాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ప్రజలు ఒక మహిళా ఎమ్మెల్యేను పొందే అరుదైన అవకాశం లభించిందని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరిస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని విమర్శించారు.
చివరకు రైతు బోర్లకూ మీటర్లు పెట్టి పెట్టుబడిదారులకు దోచిపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాడి అడ్డుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ గుంటకాడి నక్కలా కాచుకుని కూర్చుందని, ఆ నక్క ఎత్తులు దుబ్బాకలో పని చేయవన్నారు. రైతు వ్యతిరేక పార్టీలకు ఈ ఉప ఎన్నికలో డిపాజిట్ రావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి టీఆర్ఎ్సలో చేరారు.
ప్రజల ఆకాంక్షల కోసం తండ్లాడిన నేత సోలిపేట
ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఊపిరి ఉన్నంత వరకు తండ్లాడిన నాయకుడు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గుర్తు చేశారు. ఆదివారం దుబ్బాక మండలం బొప్పాపూర్, చౌదర్పల్లి, ఆకారం, గోసాన్పల్లి, రామక్కపేట, రఘోత్తంపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత రామలింగారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోవాలని, ఏళ్ల తరబడి కరువుతో తల్లడిల్లుతున్న రైతాంగానికి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ద్వారా సాగునీరు తెస్తున్నారని రామలింగారెడ్డి ఎంతో ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఆయన ఆశయాలను నెరవేర్చే ప్రతిరూపం సుజాతక్క అని తెలిపారు. లింగన్నను పోగొట్టుకోని వచ్చామని, ఆయన ఆశయాలను గెలిపించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కనబడే బీజేపీ, కాంగ్రెస్ను ఓడించాలని కోరారు.
ప్రతి గడపకూ లింగన్నతో అనుబంధం
ఈ గ్రామం లింగన్నను కడుపులో పెట్టుకుని కాపాడిందని.. ఇక్కడి ప్రతి గడపకూ ఆయనతో అనుబంధం ఉందని దుబ్బాక మండలం చౌదర్పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత భావోద్వేగంతో మాట్లాడారు. సొంత గ్రామం చిట్టాపూర్ కంటే ఎక్కువ శాతం చౌదర్పల్లిలోనే రామలింగారెడ్డి ఉండేవారని గుర్తు చేశారు. కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా నిర్బంధంలో ఉన్న సమయంలో చౌదర్పల్లి గ్రామమే ఆశ్రయం కల్పించిందని తెలిపారు. చౌదర్పల్లి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిదని కంటతడి పెడుతూ చెప్పారు. అదే ఆశీర్వాదం.. ప్రేమానురాగాలు తనపై కూడా చూపాలని కోరారు.