థాయిలాండ్ వెళ్లొచ్చినవారు సేఫ్
ABN , First Publish Date - 2020-03-19T07:00:16+05:30 IST
థాయిలాండ్ విహారయాత్రకు వెళ్లివచ్చిన వారి వివరాల కోసం సిద్దిపేట జిల్లా అధికారులు ఆరా తీశారు.. సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి18: ఇటీవల థాయిలాండ్ విహారయాత్రకు వెళ్లివచ్చిన వారి వివరాల కోసం సిద్దిపేట జిల్లా అధికారులు ఆరా తీశారు.. సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 22 మంది అక్కడికి వెళ్లారు. వీరు ఈనెల 3న హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగి ఎవరిదారిన వారు వెళ్లారు. అయితే థాయిలాండ్లో వీరితో కలిసి ఉన్న గైడ్కు కరోనా లక్షణాలున్నట్లు తేలింది. అక్కడి అధికారులు ఈ విషయాన్ని తాజాగా వీరు వెళ్లిన ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. ఇందులో సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు ఉన్నట్లు తెలిసింది. వీరిని వెంటనే గుర్తించాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డిని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. వారిలో ఇద్దరి రక్త నమూనాలను పరిశీలించగా కరోనా వైరస్ లక్షణాలు లేనట్లు వైద్యులు నిర్ధారించారు.
141 మంది రక్తనమూనాల సేకరణ
జనవరి 1 నుంచి ఇప్పటివరకు విదేశాలకు వెళ్లొచ్చిన వారి సంఖ్య 141 మంది దాకా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారందరి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించాలని జిల్లా అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటివరకైతే 30 మంది రక్త నమూనాలను గాంధీ ఆసుపత్రికి పంపించారు.