ఆక్సిజన్.. బేఫికర్
ABN , First Publish Date - 2020-07-15T18:25:12+05:30 IST
ఆక్సిజన్ అందక సర్కారు ఆస్పత్రుల్లో రోగులు చనిపోతున్నారనే..
పూర్తయిన పైప్లైన్ బిగింపు పనులు
ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యం
ఎందరు కరోనా పేషంట్లు వచ్చిన ఇబ్బంది లేదంటున్న వైద్యులు
సంగారెడ్డి అర్బన్, జూలై 14 : ఆక్సిజన్ అందక సర్కారు ఆస్పత్రుల్లో రోగులు చనిపోతున్నారనే ఆరోపణలపై సర్కారు ప్రత్యేక దృష్టి సాధించింది. ఈ మధ్య కాలంలో కరోనా బారిన పడి చాలా మంది ఆక్సిజన్ అందక మృతి చెందిన వారున్నారు. దీంతో జిల్లాలోని అన్ని సర్కారు దవఖానాల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రుల్లో రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఇక ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.
అయితే జిల్లాలోని పటాన్చెరు, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రుల్లో 70 పడకల చొప్పున ఆక్సిజన్ పైప్లైన్ బిగింపు ప్రక్రియ పూర్తయింది. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో మాత్రం 180 పడకలకు ఆక్సిజన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. దాదాపు అన్ని వార్డుల్లో ఆక్సిజన్ పైప్లైన్ బిగింపు ప్రక్రియ పూర్తయింది. ఈ వారంలో జిల్లా ఆస్పత్రిలో పనులు పూర్తవుతాయని తద్వారా ఇక జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుష్కలమైన ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. భవిష్యత్తుల్లో ఎంత మంది కరోనా బాఽధితులు వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదని డాక్టర్ సంగారెడ్డి స్పష్టం చేశారు.