వేగం నుంచి నెమ్మది!
ABN , First Publish Date - 2020-03-04T12:00:56+05:30 IST
జాతీయ రహదారి 65పై అత్యంత ప్రమాదకర ప్రదేశం (బ్లాక్స్పాట్)గా గుర్తించిన నార్కట్పల్లిలోని కామినేని వై జంక్షన్ వద్ద చేపట్టిన
గడువు దాటినా పూర్తి కాని నిర్మాణం
మరో మూడు నెలలు పట్టే అవకాశం
ఇబ్బందులు పడుతున్న వాహనచోదకులు
నార్కట్పల్లి, మార్చి 3: జాతీయ రహదారి 65పై అత్యంత ప్రమాదకర ప్రదేశం (బ్లాక్స్పాట్)గా గుర్తించిన నార్కట్పల్లిలోని కామినేని వై జంక్షన్ వద్ద చేపట్టిన వీయూపీ (వెహికల్ అండర్ పాస్) నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నిర్మాణం మొదలుపెట్టిన నాటి నుంచి కనీసం ఏడాది లోపు వీయూపీని పూర్తిచేసి ప్రధాన రహదారిని తిరిగి అందుబాటులోకి తెస్తామన్న జీఎంఆర్ ప్రతినిధుల ప్రకటనలు ఆచరణకు నోచుకోలేదు. వీయూపీ నిర్మాణ ం ప్రారంభించి దాదాపు ఏడాదిన్నర దాటుతున్నా పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తే ఇంకా 3 నెలల సమయం పడనున్నట్లు తెలుస్తోంది. వీయూపీ రోడ్డు అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా సర్వీస్ రోడ్లు వేసినా వాహనచోదకులకు మా త్రం ఇబ్బందులు తప్పటం లేదు. వంతెనతో కూడిన ప్రధా నరహదారి వాడకంలోకి వస్తేనే ప్రమాదాలు జరగవు.
రూ.40 కోట్లతో నిర్మాణం
భారత జాతీయ రహదారి ప్రాథికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) సీవోఎస్ (ఛేంజ్ ఆఫ్ స్కోప్) కింద వీయూపీ నిర్మాణం కోసం రూ.40 కోట్లను మంజూరు చేసింది. రహదారి విస్తరణ చేసిన జీఎంఆర్ సంస్థ వీయూపీ నిర్మాణ పనులను మాత్రం మరో సంస్థకు అప్పజెప్పినట్లు అనధికారిక సమాచారం. అయితే కాస్త ఆలస్యమైనా పనులను ప్రారంభించారు. దాదాపు 80కి.మీల పైబడి వేగం దాటి దూసుకొచ్చే వాహనాలతో కామినేని వై జంక్షన్ వద్ద వందల సంఖ్యలో ప్ర మాదాలు జరిగాయి. ప్రముఖులతో పాటు సాధారణ పౌరులు కూడా మృత్యువాతపడ్డారు.
మరెందరో క్షతగాత్రులై అంగవైకల్యం పొందా రు. ఈ సమస్యపై స్పందించిన అప్పటి జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అప్పటి కలెక్టర్ గౌరవ్ఉప్పల్తో పాటు ఎన్హెచ్ఏఐ రాష్ట్ర అధికారులతో కలిసి జిల్లాపరిధిలో ఉన్న 65వ నంబ రు నేషనల్ హైవేపై కామినేని వై జంక్షన్తో పాటు ప్రమాదకర ప్రదేశాల (బ్లాక్స్పాట్ల)ను పలు దఫాలుగా స్వయంగా పరిశీలించారు. రోడ్డుప్రమాదాల నివారణకై ఏ ప్రాంతంలో ఏ చర్యలు తీసుకోవాలో కలెక్టర్, ఎస్పీలు ఎన్హెచ్ఏఐ అఽధికారులకు సూచించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, కామినేని వైజంక్షన్ వద్ద వీయూపీకి కేంద్రం పచ్చజెండా ఊపింది.
ప్రస్తుతం వీయూపీ పురోగతి
ఎన్హెచ్ఏఐ నుంచి సకాలంలో నిధులు అందకపోవడమే పనుల్లో వేగం పెరగకపోవడానికి కారణమని తెలుస్తోంది. కామినేని ఎదుట అండర్ పాస్ ఇంకా నిర్మాణంలోనే ఉన్నది. అది పూర్తైతే కానీ ఫ్లైఓవర్ రోడ్ నిర్మాణం చేపట్టని పరిస్థితి. వీయూపీ పూర్తికావడానికే ఇంకా రెండునెలలు పట్టొచ్చని చెబుతున్నారు. వేగంగా పనులు చేస్తేనే ఇంకో నాలుగునెలలు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్హెచ్ఏఐ ఒత్తిడితో వేసిన సర్వీస్ రోడ్లతో తాత్కాలికంగా సమస్యలేకున్నా వంతెనతో కూడిన ప్రధాన రహదారి పూర్తైతేనే రోడ్డు ప్రమాదాలకు పుల్స్టాప్ పెట్టవచ్చు.
వీయూపీ సాంకేతిక వివరాలు
వై జంక్షన్ నుంచి వీయూపీ ప్రారంభమై సుమారు 900 మీటర్ల నిడివి మేర 6 లేన్ల వెడల్పుతో వీయూపీ రోడ్డును నిర్మిస్తున్నారు. వీయూపీ నిర్మాణం నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా రోడ్డుకు ఇరువైపులా 9 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లు వేశారు. అదేవిధంగా వర్షపు నీటితో పాటు ఇతరత్రా వాడకం నీరు వెళ్లడానికి వీలుగా ఇరువైపులా 2 మీటర్ల వెడల్పుతో డ్రైనేజీని నిర్మించారు. సర్వీస్ రోడ్లపై దాదాపు 142 లైట్లను, వీయూపీ డివైడర్పై 12 బటర్ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసేలా వీయూపీని డిజైన్ చేశారు. కామినేని అతిఽథిగృహం దాటిన తర్వాత వీయూపీ ఉండేలా నిర్మాణం చేస్తున్నారు. జూలై 2018లో ప్రారంభమైన పనులు 2019 జూన్ నాటికి పూర్తిచేస్తామని జీఎంఆర్ ప్రతినిధులు చెప్పారు.
ఆలస్యానికి జీఎంఆర్ సంస్థదే బాధ్యత
65వ నెంబర్ జాతీయ రహదారిపై కామినేని వై జంక్షన్ వద్ద చేపట్టిన వీయూపీ నిర్మాణ పనులు చేపట్టిన సంస్థకు ఎన్హెచ్ఏఐ పూర్తిగా సహకరిస్తుంది. ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతుల విషయంలో కానీ రావాల్సిన నిధుల విడుదలలో కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా మేం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు రూ.25 కోట్లకు పైగా నిధులు విడుదల చేశాం. సకాలంలో చెల్లింపులు చేయలేదని చెబితే అది సరైంది కాదు. నిర్దేశిత వ్యవధిలో వీయూపీ పూర్తికాకపోవడానికి జీఎంఆర్ సంస్థదే బాధ్యత.
- ఎం.కిరణ్, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్