అనంతలో ఒమైక్రాన కలకలం
ABN , First Publish Date - 2021-12-26T06:49:32+05:30 IST
జిల్లాలో ఒమైక్రాన కలకలం రేపింది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి జిల్లాకు దాదాపు 600 మంది గత 15 రోజుల్లో వచ్చారు. వీరిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరందరినీ గుర్తించి, వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
యూకే నుంచి వచ్చిన వ్యక్తికి నిర్ధారణ
అనంతపురం వైద్యం, డిసెంబరు25: జిల్లాలో ఒమైక్రాన కలకలం రేపింది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి జిల్లాకు దాదాపు 600 మంది గత 15 రోజుల్లో వచ్చారు. వీరిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరందరినీ గుర్తించి, వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 15 రోజుల క్రితమే విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్ రావడంతో వారి శాంపిళ్లను ఒమైక్రాన పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. నెగిటివ్ రావడం ఆ ముగ్గురు ఆరోగ్యంగా ఉండడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇటీవల మరో ఇద్దరికి పాజిటివ్ రావడంతో వారి శాంపిళ్లు హైదరబాద్కు పంపారు. అందులో యూకే నుంచి అనంతకు చేరుకున్న వ్యక్తికి ఒమైక్రాన పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని శనివారం రాత్రి రాష్ట్ర వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్క సారిగా జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది. జిల్లా అధికారులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. గుట్టగానే ఆ వ్యక్తితో పాటు అతడి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్లను గుర్తించే పనిలో పడ్డారు.
ముగ్గురికి కరోనా
అనంతపురం వైద్యం, డిసెంబరు25: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. శనివారం కొత్త మరణాలు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 158219కి చేరింది. ఇందులో 157105 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1093 మంది మరణించారు. ప్రస్తుతం 21 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.